WhatsApp Accounts: రోజురోజుకు పెట్రేగి పోతున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కొత్త తరహా మోసానికి తెరలేపారు. దీని కోసం వాట్సాప్ వినియోగదారుల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ విషయంపై భారత ప్రభుత్వ సైబర్ భద్రతా సంస్థ CERT-In అధికారికంగా అలర్ట్ జారీ చేసింది. హ్యాకర్లు వాట్సాప్లో ఉన్న డివైజ్ లింకింగ్ ఫీచర్ను దుర్వినియోగం చేస్తూ, యూజర్లకు తెలియకుండానే వారి అకౌంట్లను తమ డివైస్లకు కనెక్ట్ చేసుకుంటున్నారు. ఈ విధానాన్ని ‘ఘోస్ట్ పెయిరింగ్’గా పిలుస్తున్నారు. ఇందులో పాస్వర్డ్, OTP లేదా SIM స్వాప్ అవసరం లేకుండానే అకౌంట్ పూర్తిగా హ్యాకర్ల కంట్రోల్లోకి వెళ్తోంది.
ఈ ఘోస్ట్ పెయిరింగ్ మోసం చాలా ప్రమాదకరమని CERT-In హెచ్చరిస్తోంది. ఒకసారి అకౌంట్ హ్యాకర్ల డివైస్తో లింక్ అయితే, వారు యూజర్ మెసేజ్లను రియల్ టైమ్లో చదవగలరు. ఫోటోలు, వీడియోలు, వాయిస్ నోట్స్ను వీక్షించగలరు. యూజర్ పేరుతోనే ఇతరులకు మెసేజ్లు పంపడం కూడా సాధ్యమవుతుంది. ఇవన్నీ ఫోన్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతాయి కాబట్టి యూజర్లకు చాలా కాలం వరకు అకౌంట్ హ్యాక్ అయిన విషయం కూడా తెలియదు.
ఈ హ్యాకింగ్ ప్రక్రియ సాధారణంగా అనుమానాస్పద లింక్తో మొదలవుతుంది. ‘ఈ ఫోటో చూడండి’, ‘మీ అకౌంట్ గురించి సమాచారం’ వంటి మెసేజ్లతో పంపిన లింక్పై క్లిక్ చేస్తే, ఫేస్బుక్ మాదిరి కనిపించే నకిలీ వెబ్పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ వెరిఫికేషన్ పేరుతో మీ ఫోన్ నంబర్ అడుగుతారు. యూజర్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే, హ్యాకర్ డివైస్ పెయిరింగ్ ప్రక్రియ పూర్తి అవుతుంది. దీంతో హ్యాకర్లకు మీ వాట్సాప్ అకౌంట్పై పూర్తి నియంత్రణ లభిస్తుంది.
ఘోస్ట్ పెయిరింగ్ ద్వారా అకౌంట్ హ్యాక్ అయిన తర్వాత, హ్యాకర్లు పాత మెసేజ్లతో పాటు తాజా మెసేజ్లను కూడా చూడగలరు. మీ అకౌంట్ నుంచి గ్రూప్లకు, కాంటాక్ట్లకు మెసేజ్లు పంపి మరిన్ని అకౌంట్లను కూడా టార్గెట్ చేస్తారు. ఈ విధంగా ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్కు మోసం వేగంగా వ్యాపిస్తుంది. యూజర్ ఫోన్లో ఎలాంటి హెచ్చరికలు లేకపోవడంతో, నష్టం జరిగే వరకు చాలా మందికి అసలు విషయం అర్థం కావడం లేదు.
ఇలాంటి డిజిటల్ మోసాలను అరికట్టేందుకు టెలికమ్యూనికేషన్స్ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్లకు రాబోయే రోజుల్లో SIM బైండింగ్ను తప్పనిసరి చేయనుంది. యాక్టివ్ SIM ఉన్న డివైస్లో మాత్రమే అకౌంట్ యాక్సెస్ ఉండేలా ఈ మార్పులు తీసుకురానున్నారు. వాట్సాప్ వెబ్ లేదా లింక్డ్ డివైజ్లలో తరచూ లాగ్ అవుట్ అయ్యే విధానాన్ని కూడా అమలు చేయనున్నారు.
యూజర్లు తమ వాట్సాప్ అకౌంట్ భద్రత కోసం మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అనుమానాస్పద లింక్లను ఓపెన్ చేయకుండా ఉండాలి. ఎవరైనా ఫోన్ నంబర్ అడిగితే వెంటనే అలర్ట్ అవ్వాలి. వాట్సాప్లో లింక్ అయిన డివైజ్లను తరచూ చెక్ చేయాలి. టూ-స్టెప్ వెరిఫికేషన్ ఆన్లో ఉంచడం, యాప్ అప్డేట్స్ ఇన్స్టాల్ చేయడం కూడా చాలా అవసరం. ఒకవేళ అకౌంట్ హ్యాక్ అయినట్లు అనిపిస్తే వెంటనే వాట్సాప్ సపోర్ట్ను సంప్రదించి, సైబర్ క్రైమ్ సెల్కు ఫిర్యాదు చేయాలని CERT-In సూచిస్తోంది.