Phone Software Update: సాధారణంగా స్మార్ట్ఫోన్కు సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చినప్పుడు చాలామంది వెంటనే ఇన్స్టాల్ చేసేస్తారు. కొన్ని ఫోన్లు అప్డేట్ పూర్తయ్యాక వాటంతట అవే రీస్టార్ట్ అవుతాయి. అయితే అలా జరగకపోతే ఏం చేయాలి? మళ్లీ మనమే ఫోన్ను రీస్టార్ట్ చేయాలా? అనే సందేహం చాలామందికి ఉండొచ్చు. ఈ ప్రశ్నకు అవుననే సమాధానం చెబుతున్నారు టెక్ నిపుణులు. అప్డేట్ తర్వాత ఒక్కసారి ఫోన్ను రీస్టార్ట్ చేయడం మంచి అలవాటే. దీనివల్ల సిస్టమ్ రిఫ్రెష్ అవ్వడమే కాకుండా.. చిన్నచిన్న సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
సాఫ్ట్వేర్ అప్డేట్ సమయంలో సిస్టమ్లోని చాలా భాగాలు మారుతాయి. రీస్టార్ట్ చేయడం వల్ల కొత్త మార్పులు పూర్తిగా అమల్లోకి రావడానికి సహాయపడుతుంది. అలాగే తాత్కాలిక ఫైల్స్, మెమరీలో నడుస్తున్న కొన్ని ప్రాసెస్లు క్లియర్ అవుతాయి. ఫోన్ పనితీరులో ఏదైనా చిన్న సమస్య ఉంటే అది కూడా రీస్టార్ట్తో పరిష్కారం కావచ్చు.
Also Read: సోనీ కంపెనీ ఫోన్లు తయారు చేయడం ఆపేసిందా? అసలు ట్విస్ట్ తెలిస్తే..
అప్డేట్ ఉన్నప్పుడే కాదు.. సాధారణంగానూ ఫోన్ను క్రమం తప్పకుండా రీస్టార్ట్ చేయడం మంచిదే. వారానికి ఒకసారి రీస్టార్ట్ చేస్తే సిస్టమ్ ఫ్రెష్గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటికీ వర్తిస్తుంది.
అప్డేట్ పూర్తయ్యాక ఫోన్ సెట్టింగ్స్ సరిగ్గా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలి. నెట్వర్క్ లేదా ఇతర చిన్న సమస్యలు కనిపిస్తే అవసరమైన సెట్టింగ్స్ను రీసెట్ చేయవచ్చు. అయితే ప్రతి అప్డేట్ తర్వాత కాష్ను తొలగించడం లేదా ఇతర సెట్టింగ్స్ మార్చడం తప్పనిసరి కాదు.
స్మార్ట్ఫోన్ను రీస్టార్ట్ చేయడం వల్ల బ్యాక్గ్రౌండ్లో నడుస్తున్న అనవసరమైన యాప్స్, ప్రాసెస్లు ఆగిపోతాయి. దీంతో ఫోన్ భద్రతకు కూడా కొంత ప్రయోజనం ఉంటుంది. అందుకే అప్డేట్ తర్వాత ఫోన్ స్వయంగా రీస్టార్ట్ కాకపోతే.. మనమే ఒక్కసారి రీస్టార్ట్ చేయడం మంచిది.
Also Read: ఆండ్రాయిడ్ ఫోన్లో కొత్తగా Android Pulse ఎందుకు వచ్చింది? గూగుల్ ఏం చెబుతోంది?