Redmi Pad 2 9.7: ప్రముఖ షావోమీ సబ్ బ్రాండ్ రెడ్మీ నుంచి సరికొత్త ట్యాబ్లెట్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. Redmi Pad 2 9.7 పేరుతో వచ్చిన ఈ డివైజ్ను కంపెనీ సైలెంట్గా గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసింది. తక్కువ బడ్జెట్లో మంచి ట్యాబ్లెట్ కొనాలనుకునే వారిని టార్గెట్ చేస్తూ దీనిని తీసుకొచ్చారు. ఇది చూడటానికి చాలా స్టైలిష్గా ఉండటమే కాకుండా.. సిల్వర్, గ్రాఫైట్ గ్రే రంగుల్లో భలే ఆకర్షణీయంగా ఉంది. ముఖ్యంగా దీనిలో Wi-Fiతో పాటు 4G వాడుకునే ఆప్షన్ కూడా ఉండటం ప్లస్ పాయింట్.
ఈ ట్యాబ్లెట్ స్క్రీన్ గురించి చెప్పుకోవాలంటే.. దీనిలో 9.7 అంగుళాల 2K డిస్ప్లే ఇచ్చారు. దీనికి 120Hz రిఫ్రెష్ రేట్ తోడవడంతో స్క్రీన్ వాడకం చాలా స్మూత్గా ఉంటుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఈ ట్యాబ్లో స్నాప్డ్రాగన్ 6s జెన్ 2 ప్రాసెసర్ను వాడారు. పాత మోడల్స్తో పోలిస్తే.. ఇది 34 శాతం వేగంగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ ఓఎస్ 3తో రావడం వల్ల సాఫ్ట్వేర్ పరంగా కొత్త ఫీచర్లు అప్డేటెడ్గా ఉంటాయి.
Also Read: మగువల మనసు దోచేలా నాయిస్ స్పెషల్ గిఫ్ట్.. రూ.5,000 లోపే లగ్జరీ సిరామిక్ వాచ్!
ఈ ట్యాబ్లెట్లో వెనుక వైపు 8 మెగాపిక్సెల్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. మనం రెగ్యులర్గా వాడుకునే వీడియో కాల్స్కు ఇవి సరిపోతాయి. ఇక మెమరీ విషయానికి వస్తే.. ఈ ట్యాబ్లెట్లో 64GB, 128GB స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. ఒకవేళ ఈ మెమరీ సరిపోకపోతే.. మెమరీ కార్డ్ వేసుకుని ఏకంగా 2TB వరకు పెంచుకోవచ్చు. దీనివల్ల మనకు నచ్చిన సినిమాలు, ఫొటోలు ఎన్ని ఉన్నా దాచుకోవచ్చు.
చాలామంది ట్యాబ్లెట్లలో బ్యాటరీ బ్యాకప్ గురించి ఆలోచిస్తారు. అందుకే ఇందులో 7,600mAh బ్యాటరీని ఇచ్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా హ్యాపీగా వాడుకోవచ్చు. ఇక అందరూ ఎదురుచూసే ధర విషయానికి వస్తే.. మలేషియా మార్కెట్లో దీని ప్రారంభ ధర సుమారు రూ.13,000 దగ్గర ఉంది. 4G వెర్షన్ కావాలనుకుంటే సుమారు రూ.16,000 వరకు ఖర్చవుతుంది. తక్కువ బరువు, అదిరిపోయే ఫీచర్లు ఉన్న ఈ ట్యాబ్లెట్ కచ్చితంగా బడ్జెట్ యూజర్లకు బెటర్ చాయిస్ అవుతుంది.
Also Read: AI చరిత్రలోనే బిగ్గెస్ట్ అప్డేట్.. వచ్చేసింది GPT-5.5, ఇక కోడింగ్ చిటికెలో!