TRAI New Rules 2026: మనలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి సమస్య ఎదురయ్యే ఉంటుంది. మనం వాడుతున్న స్మార్ట్ఫోన్లో కొన్నిసార్లు రీఛార్జ్ చేసినా కూడా ఇంటర్నెట్ సౌకర్యం సరిగ్గా ఉండదు. ఆ సందర్భంలో కస్టమర్ కేర్కు ఫోన్ చేస్తే గంటల కొద్దీ వెయిటింగ్, ఆ తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోవడం అందరికీ అనుభవమే. అయితే, ఇకపై ఇలాంటి తిప్పలు తప్పనున్నాయి. జియో, ఎయిర్టెల్, వీఐ వంటి కంపెనీలు తమ కస్టమర్ల ఫిర్యాదులను గాలికి వదిలేయకుండా, వేగంగా పరిష్కరించేలా ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకురాబోతోంది. దీనికోసం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (TRAI) పాత చట్టాలను మార్చి కొత్త ముసాయిదాను సిద్ధం చేసింది.
నిజానికి మన దేశంలో టెలికాం సమస్యల కోసం 2012లో నిబంధనలు పెట్టారు. అప్పట్లో ఫోన్ చేసి బటన్లు నొక్కుతూ (IVRS) కంప్లైంట్ ఇచ్చేవాళ్లం. కానీ ఇప్పుడు అంతా స్మార్ట్ఫోన్ల జమానా కదా. ఇప్పుడు వాట్సప్ చాట్లు, మొబైల్ యాప్లు, ఈ-మెయిల్స్ అలవాటైపోయాయి. అందుకే.. పాతకాలం నాటి పద్ధతులను పక్కన పెట్టి, ప్రస్తుతానికి తగ్గట్టుగా ఫిర్యాదు చేసే విధానాన్ని మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. మనం వాడే యాప్స్ ద్వారానే చకచకా కంప్లైంట్ ఇచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Also Read: అబ్బా.. ఏం ఆఫర్ రా బాబు, Google Pixel 10 ఫోన్ ఇంత తక్కువకా? ఈ బంపర్ ఆఫర్ను మిస్ చేసుకోవద్దు!
కొత్త రూల్స్ వస్తే కంపెనీలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి వీలుండదు. కస్టమర్ కేర్ సేవలను మరింత బాధ్యతాయుతంగా మార్చాల్సి ఉంటుంది. మనం ఫిర్యాదు చేసిన తర్వాత, ఆ సమస్య ఏ స్టేజ్లో ఉంది? ఎప్పటి లోపు పరిష్కారం అవుతుంది? అనే విషయాలను మన ఫోన్ లోనే క్లియర్గా చూసుకోవచ్చు. దీనివల్ల కస్టమర్ కేర్కు కాల్స్ చేయాల్సిన అవసరం లేకుండా, పారదర్శకమైన సేవలు అందుతాయి. దీంతో మన సమయం ఆదా అవ్వడంతో పాటు సమస్య తీరుతుందన్న నమ్మకం కలుగుతుంది.
ఒకవేళ మీరు ఇచ్చిన ఫిర్యాదుకు కంపెనీ సరిగ్గా స్పందించకపోతే లేదా వారు చెప్పిన సమాధానం మీకు నచ్చకపోతే, పై అధికారులకు ఫిర్యాదు చేసే (అప్పీల్) ప్రక్రియను కూడా ప్రభుత్వం ఇంకా సులభం చేస్తోంది. ఈ అప్పీల్ పద్ధతి చాలా వేగంగా, సామాన్యులకు అర్థమయ్యేలా ఉండేలా ట్రాయ్ ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త రూల్స్పై మీకు ఏవైనా సలహాలు ఉంటే జూన్ 5, 2026 లోపు ప్రభుత్వానికి మెయిల్ ద్వారా చెప్పొచ్చు. ఈ మార్పులు కనుక అమలైతే.. మొబైల్ వినియోగదారులందరికీ పెద్ద ఊరట లభించినట్టే.