Vodafone Idea Tariffs Hike: ప్రముఖ టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా మొబైల్ టారిఫ్ లను సవరించనుంది. ఎంపిక చేసిన ప్లాన్ల టారిఫ్ లు పెంచనున్నట్లు తెలుస్తోంది. తక్షణమే టారిఫ్ లు పెంచే ప్రణాళికలు లేవని, కానీ సెలెక్టెడ్ ప్లాన్లను సర్దుబాటు చేయాలని చూస్తోందని సమాచారం. భారత్ లో రెండో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ భారతీ ఎయిర్టెల్, ఇటీవల 84 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్లలో ఒకదానిని ధరను పెంచింది. దీంతో మరికొన్ని టెలికాం ఆపరేటర్లు టారిఫ్ లను సవరిస్తాయని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా టారిఫ్ పెంపుపై కీలక ప్రకటన చేసింది.
టారిఫ్ లలో చిన్నపాటి సవరణలు ఉంటాయి కానీ, భారీగా మార్పులు ఉండవని వొడాఫోన్ ఐడియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అభిజిత్ కిషోర్ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. గత కొన్నేళ్లుగా సబ్ స్కైబర్స్ సంఖ్య తగ్గుతున్నప్పటికీ.. ఫిబ్రవరి, మార్చి నెలల్లో కొత్త సబ్ స్క్రైబర్స్ పెరిగారని సీఈవో తెలిపారు. వొడాఫోన్ ఐడియా కోలుకుంటున్న సంకేతాలు వస్తున్నాయన్నారు. తాజా ట్రాయ్ నివేదిక ప్రకారం, వొడాఫోన్ ఐడియాకు మార్చి నెలలో లక్షకు పైగా కొత్త మొబైల్ సబ్ స్కైబర్లు యాడ్ అయ్యారు.
వొడాఫోన్ ఐడియా మొబైల్ టారిఫ్లను స్వల్ప మొత్తంలోనే పెంచనుందని స్పష్టమవుతుంది. ఇటీవల భారతీ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ రీఛార్జీ ప్లాన్ ధరను 4-5 శాతం మేర పెంచింది. ఈ ఏడాది పలు కంపెనీలు 15 శాతం మేర ఛార్జీలు పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సెల్యులార్ ఆపరేటర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన డిజికామ్ సమ్మిట్లో వొడాఫోన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అభిజిత్ కిషోర్ మాట్లాడుతూ.. కంపెనీ పనితీరు ప్రస్తుతం మెరుగవుతోందన్నారు. కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉందన్నారు. తమ పనితీరుపై ప్రభుత్వానికి నమ్మకం ఉందన్నారు.
భారతీ ఎయిర్టెల్ ఇటీవల రోజుకు 1.5 జీబీ డేటాతో 84 రోజుల వ్యాలిడిటీని అందించే రూ. 859 ప్రీపెయిడ్ ప్లాన్ ధరను రూ. 899కి పెంచింది. అలాగే 77 రోజుల వ్యాలిడిటీతో ఉన్న రూ. 799 ప్లాన్ను నిలిపివేసింది. గత రెండేళ్లుగా అన్ని ప్లాన్లలోని ప్రధాన టారిఫ్లు పెద్దగా మార్పు లేదని ఈ సంస్థ తెలిపింది. రాబడులను మెరుగుపరుచుకోవడానికి, 5G మౌలిక సదుపాయాలలో పెట్టిన భారీ పెట్టుబడులను తిరిగి రాబట్టుకోవడానికి ఇవి తప్పనిసరి అని ఆపరేటర్లు అంటున్నారు.