IND vs NZ:లక్నో పిచ్.. క్యూరేటర్ ఉద్యోగానికే ఎసరు తెచ్చింది. విపరీతంగా టర్న్ కావడంతో పాటు, ఊహించని విధంగా బౌన్స్ అయ్యే పిచ్ తయారు చేసినందుకు… క్యూరేటర్ను బాధ్యతల నుంచి తప్పించింది… ఉత్తర్ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్. అతడి స్థానంలో అనుభవజ్ఞుడైన సంజీవ్ కుమార్ అగర్వాల్ను నియమించింది. వచ్చే ఐపీఎల్ కోసం కొత్త పిచ్ తయారు చేయబోతున్నారు… అగర్వాల్.
భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టీ20లో… లక్నో పిచ్ బ్యాటర్లకు ఏ మాత్రం సహకరించలేదు. పూర్తిగా బౌలర్లకు అనుకూలించిన పిచ్… బ్యాటర్లకు చుక్కలు చూపించింది. అందుకే ఆ పిచ్ మీద కనీసం వంద రన్స్ చేయడానికే కివీస్ ఆపసోపాలు పడింది. ఆ తర్వాత వంద పరుగుల లక్ష్యాన్ని అందుకోడానికి టీమిండియా బ్యాటర్లు కూడా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దాంతో… పిచ్ తయారు చేసిన క్యూరేటర్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో, అతణ్ని పక్కనబెట్టారు. ఇంతకు ముందు ఇదే పిచ్ మీద దేశవాళీ మ్యాచ్లు చాలానే జరిగాయి. అంతర్జాతీయ మ్యాచ్ కోసం క్యూరేటర్ కనీసం ఓ రెండు స్ట్రిప్లను వదిలి ఉంటే బాగుండేదని… సర్ఫేస్ ఎక్కువగా ఉపయోగించడం, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పిచ్ను సిద్ధం చేయడానికి తగినంత సమయం దొరకలేదని ఉత్తర్ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు తెలిపాయి. కొత్తగా నియమించిన క్యూరేటర్ సంజీవ్ కుమార్ అగర్వాల్కు గతంలో బంగ్లాదేశ్లోనూ పిచ్లు తయారు చేసిన అనుభవం ఉందని… బీసీసీఐ సీనియర్ క్యూరేటర్ తపోష్ ఛటర్జీతో కలిసి పని చేశారని యూసీఏ తెలిపింది.
మరోవైపు… లక్నో పిచ్ మీద మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సెటైర్లు వేశాడు. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడబోయే దక్షిణాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డికాక్… ఈ పిచ్ చూశాక ఐపీఎల్ ఆడేందుకు రాడని గంభీర్ వ్యంగ్యంగా అన్నాడు. ఎందుకంటే… ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్కు ఎకానా స్టేడియమే హోమ్ గ్రౌండ్. సొంత పిచ్ ఇలా ఉంటే ఏ ఆటగాడూ ఆడేందుకు ఇష్టపడడని గంభీర్ వ్యాఖ్యానించాడు.