Gambhir: గౌహతి వేదికగా టీమిండియా – దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండవ టెస్టులో 408 పరుగుల తేడాతో భారత్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇప్పటికే కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో ఓడిపోయిన భారత జట్టు.. గౌహతి టెస్టులోను ఓడి 2-0 తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో క్లీన్ స్వీప్ కి గురైంది. ఈ గెలుపుతో దక్షిణాఫ్రికా జట్టు దాదాపుగా 25 సంవత్సరాల తర్వాత భారత్ పై , భారత్ లో టెస్ట్ సిరీస్ నెగ్గింది.
వన్డే, టి-20 మినహా టెస్ట్ ఫార్మాట్ లో టీమిండియా గత ఏడాదికాలంగా విఫలమవుతూనే వస్తోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రయోగాలకు ప్రాధాన్యత ఇచ్చి.. జట్టులో ఆల్రౌండర్ల సంఖ్య ఎక్కువగా ఉండేలా చూస్తున్నారు. టాప్ ఆర్డర్ లో కనీసం పట్టుమని పది ఓవర్లు కూడా వికెట్ పడకుండా కాపాడే బ్యాటర్ లేడంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా జట్టులో సీనియర్లు దూరం కావడం, యువ ఆటగాళ్లు జట్టులోకి రావడం, విచిత్రమైన ప్రయోగాలు చేపట్టడంతో టెస్ట్ క్రికెట్ టాప్ ప్లేస్ లో ఉన్న భారత్ క్రమక్రమంగా దిగుజారుతూ వస్తోంది. సంవత్సరం క్రితం భారతదేశానికి టెస్ట్ సిరీస్ ఆడేందుకు వచ్చిన న్యూజిలాండ్ జట్టు కనివిని ఎరుగని రీతిలో టీమిండియాను వైట్ వాష్ చేసింది. ఆ తర్వాత భారత పర్యటనకు వచ్చిన సౌత్ ఆఫ్రికా కూడా వైట్ వాష్ చేసింది. అయితే ఇందులో భారత్ గెలిచిన రెండు టెస్ట్ సిరీస్ లు కూడా ఉన్నాయి. ఇవి చిన్న జట్లైన బంగ్లాదేశ్, మరొకటి వెస్టిండీస్. ఓడిన రెండు సిరీస్ లు పెద్ద జట్లపై. ఇవి ఒకటి న్యూజిలాండ్ కాగా మరొకటి సౌతాఫ్రికా. అయితే ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా తో టెస్ట్ సిరీస్ లో ఓడిన అనంతరం.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తనపై వస్తున్న విమర్శల నేపద్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రెండవ టెస్ట్ ఓటమి అనంతరం స్పందించారు. కోచ్ గా మీ భవిష్యత్తు ఏంటి..? అని విలేకరులు అడిగిన ప్రశ్నపై గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. ” నేను కోచ్ గా కొనసాగాలా..? వద్దా..? అన్న విషయంలో బీసీసీఐ దే తుది నిర్ణయం. ఇక్కడ దేశమే ప్రధానం. వ్యక్తులకు కాదు. టీమిండియా ఇటీవల ఇంగ్లాండ్ లో టెస్ట్ సిరీస్ ని సమం చేసింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ 2025 సైతం గెలిచింది. అప్పుడు కూడా నేనే కోచ్ గా ఉన్నాను.
టెస్ట్ క్రికెట్ లో వైఫల్యం పై ఆటగాళ్లను లేదా ఏ ఒక్కరినో నిందించలేరు. ఓటమికి అందరూ బాధ్యత వహించాల్సిందే. సుదీర్ఘ ఫార్మాట్ లో రాణించాలంటే సమిష్టి కృషి అవసరం. నిందలు అందరికీ దక్కుతాయి.. ఆ నిందలు నాతోనే మొదలవుతాయి. ఇంకా మెరుగ్గా ఆడాల్సిన అవసరం ఉంది. నేను ఎవరినీ నిందించలేదు. అలాంటివి చేయబోను. అయితే టెస్ట్ క్రికెట్ ఆడేందుకు అద్భుతమైన టాలెంట్ ఉన్న క్రికెటర్లు అవసరం లేదు. తక్కువ నైపుణ్యంతో ఆడే మానసిక ధైర్యం ఉన్న ఆటగాళ్లు కావాలి. వారి వల్లే టెస్టుల్లో మంచి ఫలితాలు వస్తాయి”. అని చెప్పుకొచ్చాడు.