Ganguly: భారత్ – సౌత్ ఆఫ్రికా మధ్య ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ ముగిసింది. ఈ మ్యాచ్ లో భారత్ కి విజయం చాలా సులభం అని అనిపించింది. మ్యాచ్ అంతటా టీమిండియా ఆధిపత్యమే కనిపించింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో కేవలం 124 పరుగుల లక్ష్యాన్ని కూడా భారత్ చేదించలేకపోయింది. 30 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఈడెన్ గార్డెన్స్ లో విజయం సాధించింది. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బవుమా ఆ జట్టు విజయంలో కీలకంగా మారాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో 35 ఓవర్లు ఎదుర్కొన్న భారత్.. 90 పరుగులకే కుప్ప కూలింది. ముఖ్యంగా బౌలర్లకు స్వర్గధామంగా మారిన ఈడెన్ గార్డెన్స్ వికెట్ పై భారత బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు.
Also Read: Vaibhav Suryavanshi: 200 పరుగులు చేసినా, మా అయ్య ఊరుకోడు
భారత బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్ 31 టాప్ స్కోరర్ గా నిలిచాడు. సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు కూడా ఈ పిచ్ పై రాణించలేకపోయారు. ఈ మ్యాచ్ లో ఒక్క ఇన్నింగ్స్ లో కూడా స్కోరు 200 పరుగులు దాటలేదంటే పిచ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం రెండున్నర రోజుల్లోనే ఈ మ్యాచ్ ముగియడంతో పిచ్ పై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తిగా బౌలింగ్ కి అనుకూలంగా ఉన్న వికెట్ ను తయారు చేయడం ఏంటని మాజీ క్రికెటర్లతో పాటు క్రీడాభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా మేనేజ్మెంట్ సమతూకమైన పిచ్ ని కోరినప్పటికీ.. కలకత్తా పిచ్ క్యూరేటర్ అందుకు భిన్నంగా వికెట్ ఇచ్చారని మండిపడుతున్నారు.
పిచ్ పై వస్తున్న విమర్శలను బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తప్పుబట్టారు. టీమిండియా కోరుకున్నట్లుగానే పిచ్ తయారు చేశామని.. ఇందులో పిచ్ క్యూరేటర్ తప్పు లేదని స్పష్టం చేశారు. పిచ్ పై మ్యాచ్ కి ముందు నాలుగు రోజులుగా వాటరింగ్ చేయలేదని.. అందుకే ఇది బౌలింగ్ కి ప్రతికూలంగా మారిందన్నాడు గంగూలి. ఈ విషయంలో పిచ్ క్యూరేటర్ ముఖర్జీని తప్పు పట్టలేమని స్పష్టం చేశాడు. అంటే పరోక్షంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ దే తప్పు అంటూ ఓకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఈడెన్ గార్డెన్స్ పిచ్ పై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. టెస్ట్ మ్యాచ్ చూడడానికి ఈడెన్ గార్డెన్స్ కి భారీ సంఖ్యలో ప్రేక్షకులు రావడం చూసి చాలా సంతోషించాను. కానీ పిచ్ ప్రవర్తించిన తీరు నన్ను షాక్ కి గురిచేసింది. టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో 159 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఆ తర్వాత భారత్ బాగా ఆడుతుందనుకున్నాను. కానీ మన జట్టు కూడా అదే తీరును కనబరిచి 189 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది.
Also Read: Ind Vs Sa: చేత్తులెత్తేసిన బ్యాటర్లు.. తొలి టెస్టులో టీమిండియాపై దక్షిణాఫ్రికా విజయం
ఇలాంటి పిచ్ లు టెస్ట్ క్రికెట్ ఉనికిని నాశనం చేస్తున్నాయి. ఈ మైదానంలో ఇప్పటివరకు చాలా టెస్టులు జరిగాయి. కానీ ఇలాంటి కండిషన్స్ ని చూడలేదు. టెస్ట్ క్రికెట్ పరువు తీస్తున్నారు”. అని తన యూట్యూబ్ ఛానల్ లో పేర్కొన్నాడు. అయితే మ్యాచ్ అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఈ విషయాన్ని అంగీకరించాడు. తాము కోరుకున్న విధంగానే పిచ్ తయారు చేశారని.. కానీ అందుకు తగ్గట్లు ఆడలేకపోయామన్నాడు.