PCB on Indian Team: ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 లో భాగంగా భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ కి సర్వం సిద్ధమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ మైదానం వేదికగా నేడు దాయాదుల పోరు జరగనుంది. నేడు మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ ఆసక్తికర పోరు ప్రారంభం అవుతుంది. చాలా సంవత్సరాల తరువాత పాకిస్తాన్.. ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇస్తుంది. ఈ క్రమంలో ఐసీసీ ఈవెంట్ లో ఎలాగైనా గెలిచి.. టైటిల్ నీ నిలబెట్టుకోవాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆశిస్తుంది.
అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ నెల 19న జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పై పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో నేడు భారత్ తో జరిగే మ్యాచ్ పాకిస్తాన్ కి కీలకంగా మారింది. ఈ మ్యాచ్ లో ఓడిపోతే టోర్నమెంట్ నుండి పాకిస్తాన్ నిష్క్రమించే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్ కి సెలెక్టర్లు ఎంపిక చేసిన జట్టు విషయంలో గత మూడు రోజులుగా ఆందోళనగా ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోహ్సిన్ నఖ్వి.. మొత్తానికి మూడవసారి మాత్రం టీమిండియాతో ఆడే జట్టుకు ఆమోదముద్ర వేశారు.
జట్టు విషయంలో పూర్తిగా బాధ్యతలు వహిస్తానని కలెక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ కి స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. జాతీయ సెలక్షన్ కమిటీలో జట్టు తాత్కాలిక హెడ్ కోచ్ అకీబ్ జావేద్, అసద్ షఫిక్, అజార్ అలీ, అలీమ్ దార్, హసన్ చీమా ఉన్నారు. అయితే ఓ జాతీయ మీడియా నివేదిక ప్రకారం జట్టుపై పిసిబి చైర్మన్ నఖ్వీకి నమ్మకం లేనందు వల్లే రెండు సార్లు జట్టును రిజెక్ట్ చేసి.. మూడవసారి ఆమోద ముద్ర వేశారట. ఇక తాజాగా నఖ్వి మాట్లాడుతూ.. నేడు భారత్ తో జరిగే మ్యాచ్ కి తమ జట్టు పూర్తి సిద్ధంగా ఉందని తెలిపారు.
మ్యాచ్ సందర్భంగా జట్టు ఆటగాళ్లను కలిసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ” నేడు జరగబోయే మ్యాచ్ ఆసక్తికరంగా ఉంటుందని ఆశిస్తున్నాం. మా జట్టు చాలా బాగుంది. ఈ మ్యాచ్ లో ఒకవేళ మా జట్టు గెలిచినా, ఓడిపోయిన మేము జట్టుకు అండగా ఉంటాం” అని ఆయన స్పష్టం చేశారు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఇండియా పై ఓడిపోతామని నఖ్వికి ముందే తెలిసిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు భారత క్రీడాభిమానులు.
ఇక నేడు జరిగే మ్యాచ్ లో గెలిస్తేనే పాకిస్తాన్ టీమ్ ఈ ఈవెంట్ లో నిలుస్తుంది. లేదంటే ఆతిథ్య జట్టుగా సొంత గడ్డపై చివరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో ఆడేది పాకిస్తాన్ కి చివరి మ్యాచ్ అవుతుంది. పాకిస్తాన్ బ్యాటింగ్ చాలా బలహీనంగా కనపడుతుంది. ఎన్ని వైఫల్యాలు ఉన్నా ఇప్పటికీ ఆ జట్టు ఇంకా బాబర్ అజామ్ పైనే ప్రధానంగా ఆధారపడి ఉంది. కానీ అతడు న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో చాలా స్లోగా బ్యాటింగ్ చేయడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. మరోవైపు రిజ్వాన్, షకీల్ కూడా తొలి మ్యాచ్లో ఫెయిల్ అయ్యారు. ఇక బౌలింగ్ విభాగంలో ముగ్గురు పేస్ బౌలర్లు పోటీపడి మరియు పరుగులు సమర్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా పై పాకిస్తాన్ గెలవాలంటే అసాధారణ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది.