IND Vs SL : ప్రస్తుతం భారత్ వర్సెస్ శ్రీలంక ఉమెన్స్ మధ్య ఐదు మ్యాచ్ ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే రెండు మ్యాచ్ ల్లో భారత్ ఘన విజయం సాధించింది. ఇవాళ మూడో టీ-20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తే.. ఎలాగైన ఈ మ్యాచ్ ను గెలవాలని శ్రీలంక పట్టుదలతో ఉంది. అటు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలో కూడా భారత మహిళలకు తిరుగులేదనే చెప్పవచ్చు. గత రెండు మ్యాచ్ ల్లో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో భారత మహిళల జట్టు విజయం సాధించింది. విశాఖపట్టణంలో తొలి రెండు మ్యాచ్ లు జరిగాయి. అయితే ఇవాళ జరిగే మూడో మ్యాచ్ మాత్రం తిరువనంతపురంలో జరుగనుంది.
సూపర్ ఫామ్ లో ఉన్న భారత మహిళల జట్టును ఎదుర్కోవడం శ్రీలంక మహిళలకు సవాలే అనే చెప్పవచ్చు. ముఖ్యంగా విశాఖలో జరిగిన తొలి రెండు మ్యాచ్ ల్లో భారత బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణించారు. భారత స్పిన్నర్లు శ్రీచరణి, వైష్ణవి శర్మ, పేసర్ క్రాంతి గౌడ్ లు లంక బ్యాటర్ను ఎక్కువ సేపు క్రీజులో నిలబడనివ్వడం లేదు. దీంతో ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేస్తూ వస్తున్నారు. దీంతో బ్యాటర్ల పని చాలా తేలిక అవుతుంది. తొలి మ్యాచ్ లో శ్రీలంకను 121 పరుగులకే కట్టడి చేశారు భారత మహిళా బౌలర్లు. మరోవైపు రెండో మ్యాచ్ లో కూడా 128 పరుగులు మాత్రమే శ్రీలంక ఉమెన్స్ జట్టు చేయగలిగింది. ఇక మూడో మ్యాచ్ లో కూడా భారత బౌలర్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శనను టీమ్ మేనేజ్ మెంట్ ఆశిస్తోంది. బ్యాటింగ్ కి అనుకూలంగా ఉండే తిరువనంతపురం పిచ్ పై వీరు అదే జోరు కొనసాగిస్తారా..? లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరోవైపు ఫీవర్ కారణంగా రెండో మ్యాచ్ కి దూరమైన దీప్తి శర్మ మూడో మ్యాచ్ ఆడనుండటం.. జట్టు బౌలింగ్ ను మరింత బలోపేతం చేయనుంది. మరోవైపు భారత మహిళా బ్యాటర్లలో స్మృతి మంధాన నుంచి జట్టు భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. తొలి రెండు మ్యాచ్ ల్లో ఆమె తక్కువ స్కోర్ కే వెనుదిరిగింది. 25, 14 పరుగులు మాత్రమే చేసింది. మూడో మ్యాచ్ లో స్మృతి మంధాన భారీ ఇన్నింగ్స్ ఆడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరోవైపు షెఫాలీ వర్మ హాఫ్ సెంచరీతో జోరుమీద ఉన్నారు. టాప్ ఆర్డరే విజయాలను అందించడంతో మిగతా బ్యాటర్లకు ఆడే అవకాశమే రాలేదు. మరోవైపు సిరీస్ లో అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని శ్రీలంక ఆశిస్తోంది. 2024లో చివరగా భారత్ పై గెలిచింది శ్రీలంక. ఇప్పటివరకు భారత్ తో జరిగిన 11 టీ-20 మ్యాచ్ ల్లో శ్రీలంక 9 మ్యాచ్ ఓడిపోవడం విశేషం.