Chennai super Kings vs Royal Challengers Bengaluru (today’s sports news): చెన్నై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్లో బెంగళూరుపై చెన్నై ఘనవిజయం సాధించింది. రవీంద్ర జడేజా(25, 17 బంతుల్లో), శివమ్ దూబే(34, 28 బంతుల్లో) చెలరేగడంతో 6 వికెట్ల తేడాతో సీఎస్కే గెలుపొందింది.
174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్కు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(15, 15 బంతుల్లో), రచిన రవీంద్ర(37, 15 బంతుల్లో; 3X4, 3X6) శుభారంభాన్ని ఇచ్చారు. కేవలం 4 ఓవర్లలో 38 పరుగులు జోడించారు. యశ్ దయాల్ బౌలింగ్లో సీఎస్కే కెప్టెన్ గైక్వాడ్ పెవిలియన్ చేరాడు. ఆ తరువాత బ్యాటింగ్కు వచ్చిన రహానే వచ్చీ రాగానే రెండు సిక్సర్లు కొట్టాడు. ఈ దశలో కరణ్ శర్మ బౌలింగ్లో సిక్స్ కొట్టి ఊపు మీదున్న రచిన్ రవీంద్ర బౌండరీ వద్ద పటీదార్కు క్యాచ్ ఇచ్చివెనుదిరిగాడు.
27 పరుగులు చేసిన రహానేను గ్రీన్ అవుట్ చేశాడు. రచిన్ రవీంద్ర స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన డారిల్ మిచెల్ 2 సిక్సర్లతో అలరించాడు. 13 వ ఓవర్లో గ్రీన్ షార్ట్ బాల్కు పటీదార్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన ఇంపాక్ట్ సబ్గా వచ్చిన శివమ్ దూబే, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా లాంఛనాన్ని పూర్తి చేశారు.
ముందుగా దినేశ్ కార్తీక్ 38* ( 26 బంతుల్లో), అనూజ్ రావత్ 48 (25 బంతుల్లో) రాణించడంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. టాస్ గెలిచి బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది. బెంగళూరు ఓపెనర్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ డు ప్లెసిస్ దూకుడుగా ఆటను ప్రారంభించారు.
దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్లో బౌండరీ సాధించిన ఆర్సీబీ కెప్టెన్.. రెండో ఓవర్ వేసిన తుషార్ దేశ్ పాండే ఓవర్లో రెండు బౌండరీలు సాధించాడు. ఇక మూడో ఓవర్ వేసిన దీపక్ చాహర్ బౌలింగ్లో నాలుగు ఫోర్లు కొట్టి స్కోరు బోర్డును పరిగెత్తించాడు. ముస్తాఫిజుర్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి ఔట్ అయ్యాడు. కేవలం 23 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 35 పరుగుల చేసి అవుట్ అయ్యాడు. అదే ఓవర్లో చివరి బంతికి రజత్ పటీదార్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత దీపక్ చాహర్ బౌలింగ్లో మ్యాక్స్వెల్ గోల్డెన్ డక్ అయ్యాడు. దీంతో పవర్ ప్లే ముగిసేలోపే ఆర్సీబీ మూడు వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో గ్రీన్.. మరో ఓపెనర్ విరాట్ కోహ్లీతో జతకట్టి నిలకడగా ఆడారు. ఈ సమయంలో కోహ్లీ, గ్రీన్ ఒకే ఓవర్లో పెవిలియన్ బాట పట్టారు. 12 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 79 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆర్సీబీని అనూజ్ రావత్, దినేశ్ కార్తీక్ ఆదుకున్నారు. తీక్షణ వేసిన 16వ ఓవర్లో 14 పరుగులు పిండిన ఈ జంట 18 వ ఓవర్లో ఆకాశమే హద్దుగా చెలరేగింది. ముఖ్యంగా అనూజ్ రావత్ 3 సిక్సులు, 4 ఫోర్లతో 18వ ఓవర్లో మొత్తం 25 పరుగులు రాబట్టాడు. ముస్తాఫిజుర్ వేసిన 19 ఓవర్లో ఈ జంట 16 పరుగులు రాబట్టింది. చివరి ఓవర్లో 9 పరుగులు రాబట్టారు. కాగా చివరి బంతికి రావత్ రనౌట్ అయ్యాడు. దీంతో ఆర్సీబీ 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో ముస్తాఫిజుర్ 4, దీపక్ చాహర్ 1 వికెట్ తీసుకున్నారు.