Kuldeep Yadav Comments: టీ20 వరల్డ్ కప్ 2024 తరువాత భారత దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్కు గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. వీరితోపాటు రవీంద్ర జడేజా కూడా వీడ్కోలు పలికాడు. యువతకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు. అయితే, ఈ ముగ్గురి రిటైర్మెంట్ నిర్ణయంపై భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్పందించారు.
ఈ సందర్భంగా యాదవ్ మాట్లాడుతూ.. ‘దక్షిణాఫ్రికాపై చివరివరకు పోరాడం. ఆఖరి ఐదు ఓవర్లలో పేసర్లు అద్భుతంగా రాణించారు. వరల్డ్ కప్ను సొంతం చేసుకున్నాక ముగ్గురు ప్లేయర్లు ఫార్మాట్కు వీడ్కోలు పలకడం నాకు ఆశ్చర్యం కలిగించింది. కానీ, అది వారి వ్యక్తిగత నిర్ణయం. దాని గురించి మనం ఎక్కువగా చర్చించొద్దు. వారు భారత క్రికెట్ కోసం ఎంతో చేశారు. యువకుల కోసం వారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గొప్ప అంశం. వరల్డ్ కప్ను గెలిచిన తరువాత ఈ ప్రకటన చేశారు. ఇంతకంటే ఘనమైన ముగింపు మరోటి ఉండదు. కుర్రాళ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. చేసుకుంటారని ఆశిస్తున్నాను’ అంటూ కుల్దీప్ పేర్కొన్నాడు.
Also Read: నా జీవితంలో ఒక క్యాచ్ పట్టా, అదే గ్రేట్ : సూర్య
ఇదిలా ఉంటే.. శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. టీ20 వరల్డ్ కప్ సమయంలో తమ జట్టు ఆటగాళ్లు పార్టీల్లో పాల్గొన్నట్లు వస్తున్న ఆరోపణలు అవాస్తవం అంటూ కొట్టిపడేసింది. మూడు రోజుల కిందట స్థానిక పేపర్లో శ్రీలంక ఆటగాళ్లు జూన్ 3న డ్రింక్ పార్టీకి హాజరయ్యారనే వార్తా కథనాలు ప్రచురించింది. ఆ వార్తా కథనాలపై బోర్డు స్పందించింది. అలాంటి వార్తా కథనాలను ఖండిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. అవన్నీ అవాస్తవాలే.. కల్పిత కథనాలే అంటూ పేర్కొన్నది. ఆధారాలు లేకుండా అలాంటివి ప్రచురించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా వ్యవహరించడం వల్ల శ్రీలంక క్రికెట్ ప్రతిష్ట మసకబారే ప్రమాదం లేకపోలేదంటూ అసంతృప్తిని వ్యక్తం చేసింది.