One World One Family Cup 2024 : బెంగళూరులోని సత్యసాయి గ్రామం ముద్దెనహళ్లిలో సాయి క్రిష్ణన్ క్రికెట్ స్టేడియంలో టీ20 ఛారిటీ మ్యాచ్ జరిగింది. ఇందులో దేశ విదేశాల నుంచి వచ్చిన సీనియర్ క్రికెటర్స్ పాల్గొన్నారు. వన్ వరల్డ్ వర్సెస్ వన్ ఫ్యామిలీ కప్ 2024 పేరిట ఈ మ్యాచ్ నిర్వహించారు. ఒకే ప్రపంచం.. ఒకే ఫ్యామిలీ అనే నినాదంతో ఈ మ్యాచ్ సాగింది.
వన్ వరల్డ్ జట్టుకు క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ కెప్టెన్ అయితే, వన్ ఫ్యామిలీ జట్టుకు ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్ లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. అదేమిటంటే పఠాన్ బ్రదర్స్ చెరో జట్టులో ఉన్నారు. యూసఫ్ పఠాన్ వేసిన ఆఖరి ఓవర్ ఐదో బంతిని ఇర్ఫాన్ పఠాన్ సిక్స్ కొట్టి సచిన్ జట్టుకి విజయాన్ని అందించాడు. తర్వాత తనని క్షమించమని అన్నయ్య దగ్గరికి పరిగెత్తాడు. దీంతో అందరి ముఖాల్లో నవ్వులు విరిశాయి.
మొదట బ్యాటింగ్ చేసిన యువరాజ్ వన్ ఫ్యామిలీ జట్టు 20 ఓవర్లలో 180 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ప్లేయర్ డారెన్ మ్యాడీ (51), లంక మాజీ వికెట్ కీపర్ కలువితరణ (22), యూసఫ్ పఠాన్ 38, యువరాజ్ (23) రన్స్ చేశారు. సచిన్ జట్టు వన్ వరల్డ్ బౌలర్లలో హర్భజన్ 2, సచిన్, ఆర్పీసింగ్, అశోక్ దిండా, మాంటీ పనేసర్ ఒకొక్క వికెట్ చొప్పున తీశారు.
తర్వాత 181 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన సచిన్ వన్ వరల్డ్ జట్టు 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. సౌతాఫ్రికా ఆటగాడు అల్విరో పీటర్సన్ (74), సచిన్ 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 27 పరుగులు చేశాడు. నమన్ ఓఝా (25) , ఉపుల్ తరంగ (29) పరుగులు చేసి మ్యాచ్ ని చివరి వరకు తీసుకెళ్లారు. ఇర్ఫాన్ పఠాన్ చివర్లో సిక్స్ కొట్టడంతో సచిన్ జట్టు విజయం సాధించింది.
యువరాజ్ వన్ ఫ్యామిలీ జట్టులో చమిందా వాస్ 3, మురళీధరన్, యువరాజ్, జేసన్ క్రేజా తలో వికెట్ తీసుకున్నారు. చాలా కాలం తర్వాత ఒకనాటి క్రికెటర్లందరూ ఒక దగ్గరకు చేరడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
సచిన్ బౌలింగ్ చేసేటప్పుడు అభిమానుల కేరింతలతో స్టేడియం హోరెత్తిపోయింది. మొత్తానికి తను ఒక వికెట్ తీసుకున్నాడు. అయితే సచిన్ బ్యాటర్ గానే అందరికీ తెలుసు. కానీ మూడు ఫార్మాట్లలో కలిపి సచిన్ 201 వికెట్లు తీసుకోవడం గొప్ప విషయం.