Gautam Gambhir Priorities as india men’s new head coach: అది 2011 ప్రపంచం వన్డే వరల్డ్ కప్ ఫైనల్..
టీమ్ ఇండియా టార్గెట్ 275 పరుగులు..
50 ఓవర్లు.. శ్రీలంక ప్రత్యర్థి..
మన డేరింగ్ అండ్ డేషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ డక్ అవుట్ అయిపోయాడు.
మన క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ 18 పరుగులు చేసి వెనక్కి తిరిగాడు.
మన కింగ్ కొహ్లీ.. 35 పరుగులు చేసి కీలక సమయంలో అవుట్ అయ్యాడు.
అందరూ అలా ఒకరి తర్వాత ఒకరు వెళ్లిపోతున్నారు.
కానీ అటు వైపు ఒక్కడు మాత్రం మొక్కవోని ధైర్యంతో, మొండిగా వికెట్ల ముందు అటు ఇటూ పరుగెడుతున్నాడు.
వికెట్ల ముందు పడిపోతున్నాడు.
మళ్లీ లేస్తున్నాడు..ఒళ్లంతా గాయాలు..
బట్టలన్నీ మట్టి కొట్టుకుపోయాయి.. అయినా సరే అలా పరుగులు తీస్తూనే ఉన్నాడు.
సరిగ్గా 97 పరుగుల దగ్గర అవుట్ అయిపోయాడు.
స్కోరు అప్పటికి 223 పరుగులు.. 41.2 ఓవర్ జరుగుతోంది.
ఇంకా విజయానికి 52 పరుగులు కావాలి. 52 బంతులు ఉన్నాయి.
నిజానికి 3 పరుగులు చేస్తే సెంచరీ పూర్తవుతుంది. కానీ అక్కడ ఒక్క బాల్ డిఫెన్స్ ఆడినా, సెంచరీ కోసం చూసినా వరల్డ్ కప్ పోతుందనే భావనతో ఫాస్ట్ బౌలింగ్ లో ఫ్రంట్ పుట్ కొచ్చి బౌల్డ్ అయిపోయాడు.
అతను మరెవరో కాదు.. డేరింగ్ అండ్ డేషింగ్ టీమ్ ఇండియా ఓపెనర్ గౌతం గంభీర్..
టీమ్ ఇండియాలో గట్స్ ఉన్న క్రికెటర్
కానీ ఆరోజు ఆ మ్యాచ్ లో మరొకరు 91 పరుగులు చేశారు. అతనే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. తను నాటౌట్ గా నిలవడమే కాదు.. చివర్లో సిక్స్ కొట్టి మ్యాచ్ గెలిపించి.. వరల్డ్ కప్ ని మరొక్కసారి తీసుకొచ్చి, ఇండియా చిరకాల వాంఛ నెరవేర్చాడు. అయితే ధనాధన్ ధోనీ హవాలో.. నాటి అసలు, సిసలైన ఓపెనింగ్ హీరో గౌతం గంభీర్ ప్రభ మసకబారిపోయింది.
అలాగే 2007లో పాకిస్తాన్ తో జరిగిన టీ 20 ఫైనల్ మ్యాచ్ లో కూడా గంభీర్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. తనొక్కడే 54 బంతుల్లో 2 సిక్స్ లు, 8 ఫోర్లతో 75 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 30 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మిగిలిన అందరూ ధనాధన్ ఆడి అవుట్ అయిపోయారు. ఆ మ్యాచ్ కూడా టీమ్ ఇండియా గెలిచి, ప్రపంచకప్ సాధించింది.
అంతేకాదు ఐపీఎల్ లో కెప్టెన్ గా 2012, 2014లో కోల్ కతా నైట్ రైడర్స్ కు టైటిళ్లు అందించాడు. 2024లో మళ్లీ మెంటార్ గా వచ్చి టైటిల్ అందించి తన సమర్థత నిరూపించుకున్నాడు.
అందుకే 13 ఏళ్ల తర్వాత గంభీర్ ప్రతిభను బీసీసీఐ గుర్తించి టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా నియమించింది. ఇకపోతే గౌతం గంభీర్ టీమ్ ఇండియా తరఫున 58 టెస్టులు ఆడి 4154 పరుగులు చేశాడు.
9 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
147 వన్డేలు ఆడి 5238 పరుగులు చేశాడు. 11 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
అలాగే 37 టీ 20 మ్యాచ్ లు ఆడి 932 పరుగులు చేశాడు. శ్రీలంకతో చేసిన 97 పరుగులు హయ్యస్ట్ స్కోరుగా ఉంది.
ట్రాక్ రికార్డ్ అద్భుతంగా ఉంది. ఇక టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా ఎటువంటి సంచలనాలు చేస్తాడోనని యావద్భారతదేశం ఎదురుచూస్తోంది. జులై 27న మొదలయ్యే శ్రీలంక పర్యటనతో గంభీర్ శకం ప్రారంభం కానుంది. మూడు టీ 20లు, మూడు వన్డేలు ఆడుతుంది. ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఒక ప్రకటనలో జట్టుకు ఇన్నాళ్లు గొప్పగా మార్గదర్శనం చేసిన రాహుల్ ద్రవిడ్ కు బోర్డు తరఫున కృతజ్ఞతలు తెలిపాడు.
కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో టీమ్ ఇండియా ప్రయాణం సాగుతుంది అని పేర్కొన్నారు. జతిన్ పరాంజపె, సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్రాలతో కూడిన క్రికెట్ సలహా సంఘం ఏకగ్రీవంగా గంభీర్ పేరు సూచించినట్టు ఆయన తెలిపారు. అతను అనుభవజ్ఞుడు, అంకితభావం ఉన్న ఆటగాడు కోచ్ గా రావడం టీమ్ ఇండియాకి శుభసూచకం అని అన్నారు.
Also Read: BCCI Prize Money Comparison: నాటికి – నేటికి.. ప్రైజ్ మనీలో ఎంత తేడా..?
2027 వరల్డ్ కప్ కి టీమ్ ఇండియాను సిద్ధం చేయడమే, ఇప్పుడు గౌతం గంభీర్ ముందున్న లక్ష్యం. 2011, 2007 వరల్డ్ కప్పుల హీరో, ఐపీఎల్ కోల్ కతా హీరో…మరేం చేస్తాడో చూద్దాం.