Land Acquisition: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన ఆలోచనలు చేస్తున్నది. ఆగస్టు 15లోపు రూ. 2 లక్షల లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించింది. రైతు భరోసా విధివిధినాల కోసం కూడా ఇది వరకు ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఓ సమీక్షా సమావేశంలో రైతుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. భూసేకరణకు సంబంధించి కలెక్టర్లు మానవీయ కోణంలో ఆలోచించాలని సూచించారు. రైతులు తరతరాలుగా ఆ భూమిని నమ్ముకుని జీవిస్తుంటారని గుర్తు చేశారు. అలాంటప్పుడు ఆ భూమిని వదులుకోవడానికి సిద్ధపడరని, ఎందుకంటే అది వారి జీవనాధారం, తరతరాల జ్ఞాపకాల తుట్టె కూడా అని వివరించారు. కాబట్టి, భూసేకరణ ప్రాధాన్యతను తెలియజేస్తూ వారిని ఒప్పించాలని కలెక్టర్లకు సూచించారు. భూసేకరణ కోసం కలెక్టర్లు రైతులతో నేరుగా మాట్లాడాలని చెప్పారు. ఇక పరిహారం విషయంలో రాజీపడొద్దని స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సచివాలయంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టుల ప్రస్తుత పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే, రీజినల్ రింగ్ రోడ్డు, మంచిర్యాల – వరంగల్- ఖమ్మం- విజయవాడ కారిడార్ గురించి మాట్లాడారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణలో జరిగిన పురోగతిపైనా రివ్యూ చేశారు.
ఈ నెలాఖరులోగా పూర్తి వివరాలు, ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు సమర్పించాలని కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విజయవాడ-నాగపూర్ కారిడార్ భూసేకరణ వేగవంతం చేయాలని, హైదరాబాద్-మన్నెగూడ రహదారి పనులు త్వరగా ప్రారంభించాలని, హైదరాబాద్-విజయవాడ ఆరు లేన్ల రహదారి విస్తరణ పనులు రెండు నెలల్లో ప్రారంభించాలని సూచించారు. తెలంగాణ సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ చేపడుతున్న ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం, ఉత్తర భాగం అని వేర్వేరుగా చూడకుండా రెంటిని కలిపి ఒకే నెంబర కేటాయించాలని తాము కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ప్రతిపాదించామని, ఇందుకు ఆయన కూడా సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వివరించారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర, ఎన్హెచ్ఏఐ మధ్య చేసుకోవాల్సిన త్రైపాక్షి ఒప్పందాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Also Read: తెలంగాణలో భారీగా ఐపీఎస్లు బదిలీ
ఈ సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సహా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.