BCCI Prize Money Comparison: టీ 20 ప్రపంచకప్ గెలిచిన టీమ్ ఇండియా ఆటగాళ్లు, కోచ్, సిబ్బందికి బీసీసీఐ రూ.125 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. సరే ఇప్పటికి ప్రపంచకప్ గెలిచి 13 ఏళ్లు అవుతోంది. అయితే 2011లో వన్డే వరల్డ్ కప్ ను ధోనీ సారథ్యంలోని టీమ్ ఇండియా గెలిచింది. అప్పుడు మరి వారికెంత ప్రైజ్ మనీ ఇచ్చారో మీకేమైనా తెలుసా? అంటున్నారు. మరి ఆ సంగతేమిటో చూద్దామా…
నిజానికి 13 ఏళ్ల క్రితం బీసీసీఐ ఆర్థిక స్థితిగతులు, భారతదేశంలో రూపాయి విలువ వీటన్నింటి బట్టి చూస్తే, నాడు ఘనంగా ఇచ్చినట్టే అనుకోవాలి. ఎందుకంటే నాటి కెప్టెన్ ధోనీ, మాస్టర్ సచిన్ టెండుల్కర్, సెహ్వాగ్, గంభీర్, హర్భజన్ లాంటి ఆటగాళ్లు తలా ఒకరికి రూ. 2 కోట్లు చొప్పున ఇచ్చారు. కోచ్, సిబ్బందికి రూ.50 లక్షలు, సెలక్టర్లకు రూ.25 లక్షలు ఇచ్చారు.
అలాగే 17 ఏళ్ల క్రితం టీ 20 ప్రపంచకప్ ను ధోనీ సారథ్యంలోని టీమ్ ఇండియా గెలిచింది. అప్పుడు బీసీసీఐ రూ.12 కోట్లు మాత్రమే రివార్డు ప్రకటించింది. నాడు ఆటగాళ్లు, కోచ్, సిబ్బంది, సెలక్షన్ కమిటీ అందరూ ఈ మొత్తాన్నే పంచుకున్నారు. ఇకపోతే 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని సాధించిన భారత జట్టులోని ఆటగాళ్లకు బీసీసీఐ తలా కోటి రూపాయల చొప్పున నజరానా అందించింది. వీటన్నింటి వెనుక ఐపీఎల్ ప్రభావాన్ని అందరూ గుర్తించాలి.
2008లో ఇండియన్ ఐపీఎల్ ప్రారంభమైంది. అప్పటి నుంచి బీసీసీఐ ఆదాయం గణనీయంగా పెరిగింది. ఇప్పటికి 16 ఏళ్లు అయ్యేసరికి క్రికెట్ ఆడే ప్రపంచ దేశాల్లో అత్యంత ధనిక బోర్డుగా బీసీసీఐ మారిపోయింది. ఈరోజున బీసీసీఐ నికర ఆస్తులు రూ.18,700 కోట్లుగా ఉంది.
అందుకే 2007లో తక్కువ ప్రైజ్ మనీ రూ. 12 కోట్లు ఇచ్చింది. అప్పటికి ఐపీఎల్ ప్రారంభం కాలేదు. ఆ తర్వాత ఏడాది 2008లో ప్రారంభమైంది. అందుకే ఛాంపియన్స్ ట్రోఫీ గెలవగానే, ఆటగాళ్లకు తలా కోటి రూపాయలు ఇచ్చింది. 2013కి వచ్చేసరికి అది రూ. 2 కోట్లు అయ్యింది. 2024 నాటికి అది రూ. 5 కోట్లు అయ్యింది. ఇదంతా ఐపీఎల్ మహిమ అని చెప్పాలి.
Also Read: రాహుల్ ద్రవిడ్ పై ఐపీఎల్ ఫ్రాంచైజీల కన్ను
మన టీమ్ ఇండియా ఇలా ప్రపంచకప్ లు గెలిచే కొద్దీ, మన బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. అలాగే మన దేశం ఆడే మ్యాచ్ లకు జనం వస్తారు. ప్రజలు వచ్చే కొద్దీ శాటిలైట్ రైట్స్ పెరుగుతుంటాయి. ప్రకటనలకు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటుంది. అందుకనే ఈరోజున టీ 20 ప్రపంచకప్ గెలిచిన వెంటనే ఆటగాళ్లకి బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. నిజానికి 2023 వన్డే వరల్డ్ కప్ గెలిచి ఉంటే, అప్పుడింకా భారీగా ప్రైజ్ మనీ ఉండేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.