Wasim Akram: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. పహల్గామ్ ( Pahalgam Incident) సంఘటన జరిగిన తర్వాత టీమిండియా అలాగే పాకిస్తాన్ జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం మానేశారు. బీసీసీఐ ఆదేశాల మేరకు పాకిస్తాన్ ప్లేయర్లకు అస్సలు ఇవ్వడం లేదు ఇండియన్స్. అయితే ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ స్టార్ ఆటగాడు వసీం అక్రమ్ (Wasim Akram) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియాకు సపోర్ట్ గా మాట్లాడితే, కొంత మంది పాకిస్తాన్ దుర్మార్గులు తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని బాంబు పేల్చారు. క్రీడా స్ఫూర్తిని చాటుకుంటూ తాను టీమిండియా ప్లేయర్లు బాగా ఆడితే మెచ్చుకుంటానని.. ఆ సమయంలో పాకిస్తాన్ లో ఉన్న కొంతమంది వెధవలు తన ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. అసభ్యకరమైన పదజాలం వాడుతూ తన కుటుంబాన్ని దారుణంగా వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు. దీంతో వసీం అక్రమ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య గ్యాప్ ఉన్న సంగతి తెలిసిందే. 2008 నుంచి ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు కూడా రద్దయ్యాయి. కేవలం ఐసీసీ టోర్నమెంట్ లో మాత్రమే రెండు జట్లు తలపడుతున్నాయి. అయితే ఇలాంటి క్రమంలో ఇండియా బాగా ఆడినప్పుడు వసీం అక్రమ్ మెచ్చుకుంటూ ఉంటారు. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ జరిగినన్ని రోజులు వసీం అక్రమ్ చాలా రివ్యూలు ఇచ్చారు. ఇండియన్ ప్లేయర్లను మెచ్చుకున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ స్టార్ ఆటగాడు వసీం అక్రమ్ ఫ్యామిలీని ఉద్దేశించి దారుణంగా పోస్టులు పెడుతున్నారట.
ఆయన భార్యా పిల్లల ఫోటోలను వైరల్ చేసి.. దారుణంగా ఆడుకుంటున్నారట. పచ్చి బూతులతో రెచ్చిపోతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా వసీం అక్రమ్ మాత్రం తాజాగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఒక మనిషికి భావ ప్రకటన స్వేచ్ఛ లేదా ? తనకు టీమిండియా ప్లేయర్ల ఆట అంటే ఇష్టం.. ఆ విషయం చెప్తే తప్పా? నేను ఏమైనా ఉగ్రవాదం చేస్తున్నానా ? అంటూ ఫైర్ అయ్యారు. అంతేకాదు మరోసారి ఐపీఎల్ టోర్నమెంట్ ను మెచ్చుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు వసీం అక్రమ్.
బీసీసీఐ నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ చాలా గొప్పదని, క్రమ క్రమంగా ఆ టోర్నమెంట్ ఎదుగుతుందని వ్యాఖ్యానించారు వసీం అక్రమ్. అలాంటి టోర్నమెంట్ ను కొట్టడం పాకిస్తాన్ వల్ల కాదన్నారు. మరో 30 ఏళ్లు అయినా ఐపీఎల్ ను PSL టచ్ చేయలేదని తెలిపారు.