Chicago: హైయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అమెరికా వెళ్లిన నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువతి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. చికాగోలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 24 ఏళ్ల గడ్సు నవ్య మృతి చెందింది. ఈ విషయంలో నవ్య తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. సొంత గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని చికాగోలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళ మృత్యువాత పడగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. రాత్రి 11.15 గంటల సమయంలో ఆ దేశ జాతీయ రహదారిపై రెండు వాహనాలు ఢీ కొన్నాయి. ఘటన సమయంలో కారు ముందు సీటులో నవ్య ఉన్నట్లు అక్కడి పోలీసులు తెలిపారు.
వాహనం వెనుక సీటులో ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి గురించి వివరాలు తెలియాల్సివుంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన 24 ఏళ్ల నవ్య తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందినది. నార్కెట్పల్లి మండలం చెర్వుగట్టు గ్రామానికి చెందిన గడుసు శ్రీనివాస్రెడ్డి పెద్ద కుమార్తె.
మృతురాలు నల్గొండ జిల్లాకు చెందిన నవ్య
ఎమ్మెస్ చదవడానికి అమెరికా వెళ్లింది, అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. కూతురు మరణవార్త తెలియగానే తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. వారి బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమ కూతురు మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు కుటుంబసభ్యులు.
నవ్య మరణ వార్త తెలియగానే మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని పరామర్శించారు సదరు మంత్రి. ఎంతో కష్టపడి అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన నవ్య, ప్రమాదంలో మృతి చెందడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ALSO READ: ఓట్ల తొలగింపుపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్.. ‘ఎస్ఐఆర్’ పై కేటీఆర్ దిశానిర్దేశం!
నవ్య కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా ఆదుకుంటామని మంత్రి తెలిపారు. నవ్య భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా ఇండియాకు తీసుకువచ్చేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తామని చెప్పుకొచ్చారు. ఢిల్లీలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో పాటు అమెరికాలోని భారత ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు.