Abhishek Agarwal : కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్. సినిమాలు చేయటమే కాదు.. పలు స్వచ్చంద కార్యక్రమాలను కూడా చేస్తుంటారాయన. కోవిడ్ 19 మహమ్మారి సమయంలో చాలా సామాజిక సేవ చేశారు. ఇప్పుడు మరొక అడుగు ముందుకేశారు. ఈ యువ నిర్మాత ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంలో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నారు. యాదృచ్ఛికంగా.. తిమ్మాపూర్..కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి జన్మ స్థలం. అభిషేక్ అగర్వాల్- మంత్రి కిషన్ రెడ్డి మధ్య మంచి అనుబంధం వుంది. వివిధ ఈవెంట్లు , ఫంక్షన్లలో చాలాసార్లు వీరు కలిసి కనిపించిన సంగతి అందరికీ తెలిసిందే.
అభిషేక్ అగర్వాల్, అతని కుటుంబం చంద్రకళ ఫౌండేషన్ స్థాపించి ప్రజలకు సేవ చేస్తున్నారు. తన తండ్రి తేజ్ నారాయణ్ అగర్వాల్ 60వ పుట్టినరోజు, దివంగత అమ్మమ్మ శ్రీమతి చంద్రకళ 90వ జయంతి సందర్భంగా తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నారు నిర్మాత అభిషేక్. శ్రీమంతుడు సినిమాలో మహేష్ ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని ఎలా అభివృద్ధి చేస్తారో మనం చూశాం. ఆ సినిమా తర్వాత మహేష్ రెండు గ్రామాలను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన్ని ఫాలో అవుతూ పలువురు ప్రముఖులు కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని డెవలప్ చేశారు. ఇప్పుడదే తరహాలో నిర్మాత అభిషేక్ ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవటం అభినందనీయం.