AD Srinivasulu Arrest: రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలకు ఇంచార్జీగా పనిచేస్తున్న సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (AD) శ్రీనివాసులు భారీ అవినీతి ఆరోపణల కేసులో చిక్కుకున్నారు. అక్రమ లావాదేవీలు, ప్రభుత్వ భూముల అనధికార బదలాయింపులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సహకారం వంటి అంశాల్లో ఏసీబీ దర్యాప్తులో కీలక ఆధారాలు లభించడంతో.. అధికారులను అతన్ని రిమాండ్కు తరలించారు.
ఏసీబీ విచారణలో భాగంగా శ్రీనివాసులు అనేక మార్పిడి లావాదేవీలకు కేంద్రబిందువుగా ఉన్నట్లు గుర్తించినట్టు సమాచారం. ముఖ్యంగా తప్పుడు సర్వే నంబర్లతో విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు పేర్లపై నమోదు చేయించడంలో కీలక పాత్ర పోషించినట్టు అధికారులు గుర్తించారు. ప్రతి అనధికార బదలాయింపు వెనుక భారీ లంచాల వ్యవహారం ఉన్నట్టు ఏసీబీ ప్రాథమికంగా అంచనా వేసింది.
వివరాల ప్రకారం.. శ్రీనివాసులు ఈ అక్రమ లావాదేవీల ద్వారా కోట్ల రూపాయలను లంచాల రూపంలో స్వీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సర్వే నంబర్లలో మార్పులు చేయడం నుండి భూ హక్కులను అనధికారంగా బదిలీ చేయడం వరకు అనేక అక్రమ చర్యల్లో ఆయన ప్రమేయం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
ఈ వ్యవహారం గతంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి వచ్చింది. రంగనాథ్ చేసిన ఫిర్యాదు మేరకు శ్రీనివాసులు, కొంత మంది అధికారులపై ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. ఆయన 2023 ఆగస్టులోనే సైబరాబాద్ సీపీకి సంప్రదించి, నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రకుంట చెరువు FTL, బఫర్ జోన్ ప్రాంతాల్లో జరిగిన అక్రమ నిర్మాణాలకు శ్రీనివాసులు సహకరిస్తున్నారని పేర్కొన్నారు.
రంగనాథ్ చేసిన ఆ ఫిర్యాదు ఆధారంగా సైబరాబాద్ EOW పోలీసులు శ్రీనివాసులు సహా పలువురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ కేసు ఏసీబీ దృష్టికి వెళ్లిన తర్వాత దర్యాప్తు మరింత వేగం పెరిగింది.
కేసుతో పాటు బుధాన్ భూముల అక్రమ బదిలీల్లో కూడా శ్రీనివాసులు కీలక పాత్ర పోషించినట్టు ఆరోపణలు ఉన్నాయి. లబ్ధిదారులకు కేటాయించిన భూములను రియల్ ఎస్టేట్ మాఫియాకు సులభంగా అందుబాటులోకి తీసుకురావడంలో ఆయన సహకారం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇవన్నీ చట్టబద్ధ మార్గంలో జరగాల్సినప్పటికీ, నకిలీ రికార్డులు తయారు చేసి భూముల విలువను మార్చి చూపినట్టు దర్యాప్తులో తేలిన వివరాలు.
దర్యాప్తు సందర్భంగా ఏసీబీ బృందాలు భారీగా రికార్డులు, ఫైళ్లను స్వాధీనం చేసుకున్నాయి. భూముల పునర్నిర్మాణం, సర్వే నంబర్ల మార్పులు, అక్రమ బదిలీలు, లంచాల లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు ముఖ్య ఆధారాలుగా ఏసీబీ ఎదుట నిలిచాయి. ఈ పత్రాలు మొత్తం అవినీతి వ్యవస్థ ఎంత పెద్దదో బయటపెడుతున్నట్టు అధికారులు తెలిపారు.
శ్రీనివాసులు పేరుతో, కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న ఆస్తుల విలువ కూడా ఏసీబీని ఆశ్చర్యపరచింది. బహిరంగ మార్కెట్ ప్రకారం ఆయన వద్ద ఉన్న ఆస్తుల మొత్తం విలువ రూ.100 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని ప్రాథమిక సమాచారం. ఈ ఆస్తుల మూలాలు, వాటి కొనుగోలు సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు అన్నీ ఏసీబీ ప్రత్యేకంగా పరిశీలిస్తోంది.
Also Read: ఇండిగో విమానం ఆలస్యం.. శంషాబాద్ ఎయిర్పోర్టులో అయ్యప్ప స్వాముల ఆందోళన