ACB Raid: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ACB అధికారులు సంచలన దాడి నిర్వహించారు. పోస్ట్ మార్టం నివేదిక ఇప్పించేందుకు లంచం డిమాండ్ చేసిన హోంగార్డు నగేష్ను అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఏసీబీ బృందం, కీసర ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో నగదు మారుతుండగా నిందితుడిని అదుపులోకి తీసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మృతుడు తోటకూర మహేష్కు సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం గత నాలుగు నెలలుగా ఆయన మేనల్లుడు శరత్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో హోంగార్డు నగేష్ మధ్యవర్తిత్వం వహించి, గాంధీ ఆసుపత్రి డాక్టర్ సందీప్ పేరును వాడుకుంటూ రిపోర్ట్ కావాలంటే 2 లక్షల రూపాయలు సమర్పించుకోవాలని బాధితుడిని వేధించాడు. చివరికి బాధితుడి దీనస్థితిని చూసి 40 వేల రూపాయలకు బేరం కుదుర్చుకున్నాడు.
ఒప్పందంలో భాగంగా బాధితుడు శరత్ ఇప్పటికే 5 వేల రూపాయలను నగేష్కు అందజేశారు. మిగిలిన 35 వేల రూపాయలను తీసుకునేందుకు కీసర ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు రావాలని నగేష్ సూచించాడు. అయితే, లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో, వారు పక్కా ప్రణాళికతో నిఘా పెట్టారు. శనివారం ద్వితీయ విడత నగదు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు నగేష్ను చుట్టుముట్టి పట్టుకున్నారు.
ఈ అవినీతి భాగోతంలో హోంగార్డు నగేష్తో పాటు మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. డాక్టర్ పేరు చెప్పి డబ్బులు వసూలు చేయడం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు అనే కోణంలో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రస్తుతం నగేష్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, స్టేషన్లోని ఇతర రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు.
Also Read: హరీష్ రావు పై విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సెటైర్లు..?
చనిపోయిన వ్యక్తి రిపోర్ట్ కోసం నెలల తరబడి వేచి చూడటమే కాకుండా, వేలల్లో లంచం డిమాండ్ చేయడంపై స్థానికంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. సామాన్యులను ఇబ్బందులకు గురిచేసే ఇలాంటి అవినీతి పరులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు హెచ్చరించారు. ఈ ఘటన కీసర పోలీస్ వర్గాల్లో కలకలం రేపింది.