Miryalaguda: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ చోటుచేసుకున్న అక్రమాల గుట్టును ఏసీబీ అధికారులు తేల్చేశారు. గురువారం ఉదయం 11 గంటలకు ఇక్కడి మున్సిపల్ కార్యాలయంలో మొదలైన ఏసీబీ అధికారుల తనిఖీలు శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటల వరకు కొనసాగించారు. సుమారు 15 మంది బృందంతో కూడిన ఏసీబీ అధికారుల బృందం చేపట్టిన తనిఖీల్లో 2025_26 వార్షిక పన్ను అంచన 24.86 కోట్ల లక్ష్యం కాగా కేవలం రూ. 9.17 కోట్ల చేసి ప్రభుత్వానికి 15.68 కోట్ల బకాయిలు మిగిల్చి నష్టాన్ని మిగిల్చినట్లు గుర్తించారు. అదేవిధంగా 2025_26, 2026_27 ఏడాదికి సంబంధించి షాపులపై రూ. 79.18 లక్షలకు కేవలం రూ. 36.12 లక్షలు వసూలు చేసి 43.36 లక్షల బకాయి మిగిలి ఉందన్నారు.
2025_26 లో మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై 54 ఫిర్యాదులు రాగా సంబంధిత యాజమాన్యాలకు నోటీసులను ఇచ్చిన టౌన్ ప్లానింగ్ అధికారులు తదుపరి చర్యలు తీసుకోలేదని చెప్పారు. భవన నిర్మాణాలు, లేఅవుట్ అనుమతుల, మున్సిపల్ ఆస్తుల ఆక్రమణల నమోదుకు నిర్వహించే రికార్డులు నిర్వహణలో అక్రమాలను గుర్తించినట్లు చెప్పారు. టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి 2024_25 లో 3.29 కోట్లు రాగా 2025_26 లో 3.05 కోట్లకు పడిపోయిందన్నారు. ఇదే ఏడాది 34 నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినట్లు చూపించిన 18 దరఖాస్తులే వచ్చినట్లు రికార్డులో నమోదు చేశారన్నారు.
Also read: వంటగదిలో మృత్యుఘోష.. సిలిండర్ పేలి ఐదుగురు దహనం.. వెంకటగిరి ప్రాంతంలో కలకలం!
కొన్ని రిజిస్టర్లలో అధికారుల సంతకాలు లేవన్నారు. పర్సనల్ క్యాష్ బుక్ నిర్వహించక పోవడంతో ఆఫీస్ ఖర్చుల వివరాలను గుర్తించే పరిస్థితి లేదన్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో వాహనాల వినియోగం, రిపేర్లు ఇతర ఖర్చులకు సంబంధించిన సంబంధించిన రికార్డులను నిర్వహించట్లేదని చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలోని వాహనాలకు నెలకు రూ. 19.33 లక్షల విలువైన ఇంధనాన్ని ఖర్చు చేస్తున్నట్లు రికార్డుల్లో గుర్తించామన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో ఈ ఏడాది మార్చిలో కొంతమంది గైర్హాజరైనప్పటికీ పూర్తి వేతనాన్ని అందుకున్నట్లు రికార్డులను నమోదు చేసినట్లు చెప్పారు. ఏసీబీ అధికారుల తనిఖీల సమయంలో మిర్యాలగూడ మున్సిపల్ డివిజన్ ఇంజనీర్ వెంకన్న గైర్హాజరైనట్లు చెప్పారు.
ఈ మున్సిపాలిటీ పరిధిలో రికార్డుల లోపాలు, పన్నుల వసూళ్లు, ఇతర అంశాలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు ఏసీబీ అధికారులు చెప్పారు. అయితే ఏసీబీ అధికారుల రాకతో కొన్ని క్షణాల్లోనే కీలకమైన ఫైళ్లను మాయం చేశారని మిర్యాలగూడ మున్సిపాలిటీ సిబ్బంది సంబంధిత ఇంజనీర్కు సమాచారం ఇవ్వటంతోనే ఏసీబీ అధికారుల తనిఖీల వేల అధికారి గైర్హాజరైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఏసీబీ అధికారులు సుమారు 17 గంటల పాటు చేపట్టిన తనిఖీలతో కొంతమేరకు అవినీతి, అక్రమాలు వెలుగు చూశాయి. ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి అందనున్న నివేదిక నేపథ్యంలో ఏ అధికారి పైన అయిన వేటు పడుతుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.
Also Read: విజయ్ దేవరకొండ పుట్టిన రోజు స్పెషల్.. ఈ విషయాలు మీకు అస్సలు తెలిసుండవు..