Bullet Train Stations Plans for Telangana: తెలంగాణలో హైస్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం, రైల్వేశాఖ ప్రత్యేక దృష్టి పెట్టాయి. హైదరాబాద్ ను దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో బుల్లెట్ రైలు ద్వారా కనెక్టివిటీ అందించాలని భావిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్–బెంగళూరు, ముంబై–హైదరాబాద్ కారిడార్లు ఈ ప్రాజెక్టులో కీలకంగా మారాయి. ఈ రెండు మార్గాలు అమల్లోకి వస్తే తెలంగాణ రవాణా రంగంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
తాజా బుల్లెట్ రైలు ప్రణాళికల్లో శంషాబాద్ సెంటర్ పాయింట్ గా మారబోతోంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉండటం వల్ల శంషాబాద్ ను హైస్పీడ్ రైలు హబ్ గా అభివృద్ధి చేయాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. భవిష్యత్తులో విమాన ప్రయాణాలు, మెట్రో, బుల్లెట్ రైళ్లు అన్నీ ఒకే చోట లింక్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికులకు వేగవంతమైన కనెక్టివిటీ అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
హైదరాబాద్–బెంగళూరు బుల్లెట్ రైలు కారిడార్ తెలంగాణకు చాలా కీలకంగా మారనుంది. ఐటీ, బిజినెస్, ఎడ్యుకేషన్ రంగాల్లో ఈ రెండు నగరాలకు ఇప్పటికే బలమైన సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం రోడ్డు, సాధారణ రైలు మార్గంలో ప్రయాణానికి ఎక్కువ సమయం పడుతోంది. అయితే, బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం భారీగా తగ్గే అవకాశం ఉంది. ఈ మార్గంలో ఉన్న మహబూబ్నగర్ లో ముఖ్యమైన స్టేషన్ ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీంతో ఆ ప్రాంత అభివృద్ధి కూడా ఊతం లభించనుంది.
ఇక ముంబై–హైదరాబాద్ హైస్పీడ్ రైలు మార్గం కూడా తెలంగాణకు మరింత మేలు చేయనుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైతో హైదరాబాద్ ను బుల్లెట్ రైలు ద్వారా అనుసంధానించడం వల్ల వ్యాపార, పారిశ్రామిక రంగాలకు ప్రయోజనం కగలనుంది. ఈ కారిడార్ లో జహీరాబాద్ లో స్టేషన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న జహీరాబాద్ కు బుల్లెట్ రైలు కనెక్టివిటీ రావడం వల్ల మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశముంది.
దక్షిణ భారత హైస్పీడ్ రైలు నెట్ వర్క్ లో హైదరాబాద్ ను కీలక కేంద్రంగా తీర్చిదిద్దాలని అధికారులు భావిస్తున్నారు. చెన్నై, బెంగళూరు, ముంబై లాంటి ప్రధాన నగరాలకు వేగవంతమైన రైల్వే కనెక్టివిటీని అందించడమే లక్ష్యంగా ఉంది. భవిష్యత్తులో ఈ నెట్ వర్క్ మరిన్ని నగరాలకు విస్తరించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఈ బుల్లెట్ రైళ్లు అత్యాధునిక సాంకేతికతతో పని చేయనున్నాయి. గంటకు సుమారు 350 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసేలా కారిడార్లను రూపొందిస్తున్నారు. దీంతో ప్రస్తుత ప్రయాణ సమయంలో సుమారు సగానికి పైగా తగ్గనుంది. రోడ్డు రవాణాపైనా ప్రెజర్ తగ్గనుంది.
Read Also: బెంగళూరు-హైదరాబాద్ బుల్లెట్ రైల్ రూట్ ఫిక్స్, స్టేషన్లు ఎక్కడెక్కడ ఉంటాయంటే?