RDO Transfer: నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో ఆర్డీవో మాధవి బదిలీ హాట్ టాపిక్గా మారింది. ఆర్డీవో బదిలీని పురస్కరించుకుని పట్టణ ప్రజలు సంబరాలు చేసుకోవడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంబేద్కర్ చౌరస్తాలో టాపాసులు పేల్చుతూ, స్వీట్లు పంచుతూ ప్రజలు తమ ఆనందాన్ని బహిరంగంగా వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలు చూసినవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
అచ్చంపేటలో విధులు నిర్వహించిన ఆర్డీవో మాధవి తీర్పులపై స్థానికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆమె తీసుకున్న నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయని, వాటి వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, అర్హత ఉన్న వారికి కాకుండా ఇతరులకు ఇళ్లను మంజూరు చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అనేకమంది పేదలు సంవత్సరాలుగా ఎదురుచూసినా న్యాయం జరగలేదని వాపోతున్నారు.
భూమి సమస్యల విషయంలో కూడా ఆర్డీవో మాధవి.. కొంతమంది వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరించారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పట్టణంలో భూముల రికార్డుల సవరణలు, పట్టాలలో మార్పులు వంటి అంశాల్లో ఆలస్యం చేసి ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పించారనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ కారణాలతోనే ప్రజల్లో అసంతృప్తి రోజు రోజుకు పెరిగిపోయింది.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెల 22వ తేదీన అధికారులు ఆర్డీవో మాధవిని బదిలీ చేయడాన్ని స్థానికులు ఉపశమనంగా భావించారు. ఆమె స్థానంలో ప్రస్తుతం భూ సేకరణ డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న యాదగిరికి తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. ఈ వార్త బయటకు రావడంతో అచ్చంపేట పట్టణంలో ఒక్కసారిగా ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. ప్రజలు గుంపులుగా చేరి అంబేద్కర్ చౌరస్తాలో టపాసులు పేల్చారు. ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ప్రజలు సంబరాలు చేసుకోవడం ఒక్కపక్క చర్చనీయాంశంగా మారగా, మరోవైపు కొందరు బాధ్యతాయుతంగా స్పందిస్తున్నారు. అధికారులపై ఆరోపణలు ఉన్నప్పటికీ, తుది నిర్ణయం ప్రభుత్వ వ్యవస్థే తీసుకోవాలని, న్యాయపరమైన ఆలోచనతో ముందుకు సాగాలని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Also Read: బంగారం కొట్టేసీ.. రివాల్వర్ అమ్మేసి.. అడ్డంగా దొరికిపోయిన ఎస్సై
ఇక తాజా బాధ్యతలు చేపట్టిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ యాదగిరిపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. గత తప్పిదాలు పునరావృతం కాకుండా పారదర్శకంగా పాలన సాగించాలని కోరుతున్నారు. భూ సమస్యలు, డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాల్లో న్యాయంగా వ్యవహరించాలని కోరుతున్నారు. ముఖ్యంగా పేదలకు సంక్షేమ పథకాలు చేరేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.