BRS Party: స్థానిక ఎన్నికలకు బీఆర్ఎస్ నాయకత్వం క్యాడర్ ను సన్నద్ధం చేస్తుందా?…గ్రామస్థాయి నుంచి క్యాడర్ చేజారుతుందనే భయంతో వారిని కాపాడుకోవడానకి ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోందా? ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ పెద్దలు క్యాడర్ దగ్గరకు వెళ్లలేదు. అడపాదడపా మాత్రమే పార్టీ కార్యక్రమాలు చేపడుతూ తాము ఉన్నామంటే ఉన్నామన్నట్లు వ్యవహరిస్తూ వచ్చారు. దాంతో సహజంగానే గులాబీశ్రేణులు డల్ అయిపోయాయి. ఆ క్రమంలో స్థానిక సంస్థల్లో మెజార్టీ స్థానాలు సాధించి పార్టీ కేడర్ లో ఆత్మస్థైర్యం నింపడానికి ప్లాన్ చేస్తోందంట బీఆర్ఎస్ నాయకత్వం. ఆ ప్లాన్లు ఏమేరకు వర్క్ అవుట్ అవుతాయో అనేది పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు
తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది. ప్రభుత్వం సైతం ప్రాధాన్యత క్రమంలో లోకల్ బాడీస్ ఎలక్షన్లు నిర్వహించేందుకు రంగం సిద్దం చేస్తోంది. దాంతో ఎన్నికలకు పార్టీ కేడర్ ను సన్నద్ధం చేయాలని బీఆర్ఎస్ భావిస్తుందట. అందులో భాగంగానే నియోజకవర్గాల వారీగా ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని భావిస్తుంది. ఇప్పటికే కేటీఆర్ సిరిసిల్లలో, హరీష్ రావు గజ్వేల్ లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో పరిపాలన మూలనపడి అభివృద్ది కుంటుపడటం, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాలన వైఫల్యాలు, హామీల అమలులో జాప్యంను వివరిస్తున్నారు.
ప్రభుత్వ వైఫ్యల్యాలపై కరపత్రాల పంపిణీకి సమాయత్తం
బీఆర్ఎస్ పాలనలో చేసిన పనులను వివరించాలని క్యాడర్కు సూచిస్తున్నారు. యువత, విద్యార్థి, అన్ని వర్గాల ప్రజలతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను సైతం ప్రతి ఇంటికి చేరేవేశాలా కరపత్రాలను పంపిణీ చేసేందుకు సమాయత్తం చేస్తున్నారంట. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వరుసగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలని పార్టీ అధిష్టానం జిల్లా నేతలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈసారి ప్రధానప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ గతానికి భిన్నంగా మెజార్టీ గ్రామపంచాయతీలపై దృష్టి సారించినట్లు పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. అందుకే స్థానిక ఎన్నికలకు ముందు గ్రామస్థాయిలో నేతలు, కార్యకర్తలు పార్టీని వీడకుండా చర్యలు చేపడుతున్నారట. నియోజకవర్గస్థాయిలో ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించడం అందుకేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో గ్రామస్థాయిలో విపక్ష నేతలు తమ ప్రయోజనాలు, గతంలో ఇచ్చిన హామీలు నేరవేర్చడం కోసం అధికార పక్షం వైపు మొగ్గు చూపుతుండటం సహజంగా జరిగేదే. అలాంటి వారికి అడ్డుకట్ట వేయాలని భావించి సమావేశాలకు శ్రీకారం చుట్టారనేది పార్టీ ఇంటర్నల్గా జరుగుతున్న చర్చ.
క్యాడర్ని యాక్టివ్ మోడ్లోకి తేవడానికి రెగ్యులర్గా పార్టీ కార్యక్రమాలు
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పటివరకు గ్రామస్థాయిలో ఏ ఒక్క కార్యక్రమాన్ని బీఆర్ఎస్ చేపట్టలేదు. దీంతో గ్రామస్థాయిలోని క్యాడర్ పూర్తిగా ఢీలా పడిపోయింది. ఇప్పటికే అత్యధిక గ్రామాల్లో గులాబీ శ్రేణులు తమదారి తాము చూసుకుంటున్నాయి. ప్రస్తుతం ఎలాంటి కార్యక్రమాలు లేకపోవడంతో ఉన్న క్యాడర్ కూడా సైలెంట్ అయిపోయింది. ఆ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతుండటంతో ఉన్న వారిని కాపాడుకుంటూ, వారిని యాక్టివ్ మోడ్లోకి తేవడానికి రెగ్యులర్గా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని గులాబీ పార్టీ పెద్దలు భావిస్తున్నారంట. ఇప్పుడు కూడా మేల్కొకపోతే పార్టీకి భారీగా నష్టం జరుగుతుందని భావనలో నాయకులు ఉన్నారట.
ప్రజలు కేసీఆర్ పాలన కోసం ఎదురు చూస్తున్నారని ప్రకటనలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందంటున్నారు. అందుకు తగ్గట్లుగానే కేడర్ను సన్నద్ధం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందంట బీఆర్ఎస్ నాయకత్వం. ప్రజలంతా కేసీఆర్ పాలన కోసం ఎదురుచూస్తున్నారని ఇప్పటికే పలుసందర్భాల్లో బీఆర్ఎస్ కీలక నేతలు పేర్కొంటున్నారు. ఇదే సందేశాన్ని గ్రామస్థాయిలో కేడర్ కు వివరించాలని భావిస్తున్నారట. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, పార్టీ మారినవారికి రాజకీయ భవిష్యత్ ఉండదని, వచ్చే మన ప్రభుత్వంలో పదవులు ఇస్తామని హామీలు ఇస్తూ నేతలు పార్టీ మారకుండా చర్యలు చేపడుతున్నారట. పార్టీకోసం పనిచేసేవారికి తగిన గుర్తింపు ఇస్తామనే భరోసా కల్పించడానికి ప్రయత్నిస్తున్నారంట.
అధికారంలో ఉన్నప్పుడు గ్రామీణ క్యాడర్ను పట్టించుకోని నేతలు
రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ గ్రామస్థాయిలో కేడర్ ను పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే సైతం నేతలు కలిసేందుకు వెళ్తే గంటల తరబడి వెయిట్ చేయించుకునేవారనే విమర్శలు ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో వర్గాలుగా నేతలను విడదీసి పాలించారని గతంలో నేతలు బహిరంగంగానే పేర్కొన్న సందర్భాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో వారంతా కలిసి ముందుకు సాగుతారా..పార్టీ కోసం కష్టపడేవారికి టికెట్లు ఇస్తుందా..లేదా పైరవీలు చేసేవారికి పెద్దపీట వేస్తారా అన్న ఉత్కంఠ గులాబీ శ్రేణుల్లో నెలకొంది.
Also Read: వీడు ఎవడ్రా బాబు.. ఏకంగా ఆర్టీసీ బస్సునే చోరీ చేసిన దొంగ..
అర్హులకు అందని డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితబంధు, బీసీలకు లక్షసాయం
గతంలో గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితబంధు, బీసీలకు లక్షసాయం పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడంతో ఆయా వర్గాల ప్రజలు నారాజ్ గా ఉన్నారనే సంకేతాలు పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తున్నాయంట. ఇప్పుడు వారి దగ్గరకు వెళ్తే ఎలా రిసీవ్ చేసుకుంటారనేది పార్టీ స్థానిక నాయకులను టెన్షన్ పెడుతోందంట. ఒకవైపు చేజారి పోతున్న క్యాడర్, పదేళ్ల పాలనపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతల నేపధ్యంలో .. లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ అధిష్టానం పెట్టుకున్న టార్గెట్ ఏ మేరకు రీచ్ అవుతుందో చూడాలి.
Story By KLN, Bigtv