Aliabad Municipality: స్వేచ్ఛ బ్యూరో: అలియాబాద్ పురపాలక సంఘంలో కో-ఆప్షన్ సభ్యుల నియామకానికి సంబంధించి ప్రక్రియ ప్రారంభమైనట్లు మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ సర్క్యులర్ మేరకు ఈ ఎంపిక చేపడుతున్నట్లు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ మున్సిపాలిటీస్ రూల్స్–2020 నిబంధనల ప్రకారం ప్రత్యేక పరిజ్ఞానం లేదా అనుభవం కలిగిన ఇద్దరు సభ్యులను కో-ఆప్ట్ చేయనున్నారు. వీరిలో ఒకరు మహిళ తప్పనిసరి. అలాగే మైనారిటీ వర్గానికి చెందిన ఇద్దరు సభ్యులను ఎంపిక చేయగా, వారిలో ఒకరు మహిళగా ఉండాలని నిబంధనలు పేర్కొంటున్నాయి.
అర్హతల విషయానికి వస్తే.. మున్సిపాలిటీ ఓటర్ల జాబితాలో నమోదై ఉండటం, కనీసం 21 సంవత్సరాల వయస్సు పూర్తి చేసి ఉండటం తప్పనిసరి. మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్లో ప్రజాప్రతినిధిగా ఐదేళ్ల అనుభవం లేదా గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుడిగా పని చేసిన అనుభవం ఉండాలి. మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్గా మూడేళ్లు పనిచేసిన న్యాయవాదులు లేదా ప్రభుత్వంలో గెజిటెడ్ హోదాలో సేవలందించినవారు కూడా అర్హులని పేర్కొన్నారు.
Also Read: సమంతాను మెప్పించిన రీల్.. టైలర్ టాలెంట్ కు ప్రశంసల వర్షం!
మైనారిటీ కోటాకు దరఖాస్తు చేసుకునే వారు మున్సిపాలిటీ ఓటరు అయి ఉండటంతో పాటు, 21 సంవత్సరాలు పూర్తి చేసి, మైనారిటీ వర్గానికి చెందినవారు కావాలని తెలిపారు. దరఖాస్తు నమూనాలు ఏప్రిల్ 2 నుంచి మున్సిపల్ కార్యాలయంలో కార్యాలయ వేళల్లో అందుబాటులో ఉంటాయని, దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్ 10 సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంటుందని కమిషనర్ స్పష్టం చేశారు. ఆ తరువాత వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమని తెలిపారు.
Also Read: మీ సేవా కేంద్రాల్లో పెరిగిన ఛార్జీలు.. రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి కొత్త ధరలు