Marriage Fraud: స్వేచ్ఛ బ్యూరో: తొర్రూరు మండలంలోని కర్కాల గ్రామపంచాయతీలో పనిచేసిన కార్యదర్శి కె. ప్రభు అక్రమాల పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తన పదవీకాలంలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వివాహ నమోదుల్లో తీవ్ర లోపాలు, అవకతవకలు జరిపినట్లు ఆరోపించారు. ఫిర్యాదు వివరాల ప్రకారం.. గ్రామపంచాయతీ పరిధిలో అసలు పెళ్లి జరగకపోయినా మ్యారేజ్ రిజిస్టర్లో తప్పుడు తేదీ నమోదు చేసి, 26 రోజుల వ్యత్యాసంతో ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ జారీ చేసినట్లు వెల్లడించారు.
ఇదే సమయంలో గ్రామంలో నిజంగా జరిగిన రెండు వివాహాలను అధికారిక రికార్డుల్లో నమోదు చేయకుండా వదిలేసినట్లు తెలిపారు. అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ నంబర్లు, సీరియల్ నంబర్లను నియమాలకు విరుద్ధంగా తన ఇష్టానుసారం నమోదు చేసి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ విషయంపై ఇప్పటికే జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: అనుకున్నది ఒకటి అయినది మరొకటి.. గలాబీలో ఇప్పుడిదే హట్ టాపిక్..?
దీంతో సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కలెక్టర్కు మరోసారి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. కార్యదర్శి ప్రభుపై సమగ్ర విచారణ చేపట్టి, శాఖాపరమైన చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని ఫిర్యాదుదారులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే ఈ తరహా ఘటనలను సహించరాదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Also Read: రేపటి నుంచే ఏపీలో నేతన్నలకు ఉచిత విద్యుత్ అమలు!