Sanga Reddy: సంగా రెడ్డి అమీన్పూర్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెళ్లయిన నెల రోజులు కూడా గడవకముందే ఓ నవవరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్టోబర్ 8వ తేదీన వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆ యువకుడు, నవంబర్ 1న మనస్తాపంతో ఉరివేసుకుని తనువు చాలించాడు. భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్న మనస్పర్ధలే ఈ దారుణానికి దారితీశాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
అమీన్పూర్ పరిధిలోని సుల్తాన్పూర్లో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన బోయిని రాములు, సిల్వర్ ఓక్స్ స్కూల్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనికి, అనిత అనే యువతికి అక్టోబర్ 8వ తేదీన పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది. ఇద్దరూ ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నారు.
Read Also: Constable suicide: రాష్ట్రంలో దారుణ ఘటన.. గన్తో కాల్చుకుని కానిస్టేబుల్ సూసైడ్, ఎందుకంటే?
పెళ్లయిన వారం రోజుల తర్వాత, రాములు తన భార్యతో కలిసి సుల్తాన్పూర్లోని తన అన్న బోయిని నరేష్ ఇంట్లో ఉంటున్నాడు. గత నెల (అక్టోబర్) 28వ తేదీన భార్యాభర్తల మధ్య సంసార జీవితానికి సంబంధించి గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన రాములు, నవంబర్ 1వ తేదీ సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లాడు. “ఇప్పుడే వస్తాను” అని చెప్పి తన అన్నయ్య బైక్ తీసుకుని వెళ్లిన అతను, గ్రామ శివారులోని ఓ వేప చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నవంబర్ 2న రాములు మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి సోదరుడు బోయిని నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై ఎస్ఐ విజయ్ మాట్లాడుతూ.. “భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, చిన్న మనస్పర్ధలు రావడంతో రాములు ఆవేశంలో ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు విచారణలో తేలింది. చనిపోయే ముందు రాములు ఎటువంటి సూసైడ్ నోట్ రాయలేదు, భార్యకు గానీ, కుటుంబ సభ్యులకు గానీ ఎలాంటి మెసేజ్లు పంపలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదులో కూడా కొడుకు ఆవేశంతో ఆత్మహత్య చేసుకున్నాడనే ఉంది” అని తెలిపారు. మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు.