తెలంగాణలో మరో ఉపఎన్నిక ఖరారు అయినట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ ఫిరాయింపుల అంశంలో మొత్తం 9 మందికి సంబంధించిన ఎమ్మెల్యేల విచారణను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పూర్తి చేశారు. ఇప్పటికే ఐదుగురికి క్లీన్ చిట్ ఇచ్చారు. తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశామని అఫిడివిట్స్ దాఖలు చేయడంతో వారిపై స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరో నలుగురి విచారణ సైతం పూర్తయింది. వారు సైతం తాము అధికార పార్టీలో చేరలేదని గులాబీ పార్టీలోనే ఉన్నట్టు స్పీకర్కు వివరణ ఇచ్చినట్టు సమాచారం. ఇక మిగిలింది ఒకేఒక్కరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్..
దానం నాగేందర్ ఇప్పటివరకు స్పీకర్కు వివరణ ఇవ్వలేదని తెలుస్తున్నది. ఆయన మీద అనర్హత ఎందుకు వేయకూడదో వివరణ ఇస్తే గానీ స్పీకర్ నిర్ణయం తీసుకోలేరు. ఇదిలాఉండగా దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్టు స్పష్టమైన ఆధారాలు అటు బీఆర్ఎస్ పార్టీ వద్ద ఉన్నాయి. ఎందుకంటే ఆయన గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అంతేకాకుండా ఇటీవల కాంగ్రెస్ తరఫున జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నవీన్ యాదవ్ తరఫున ప్రచారం చేసినట్టు చెబుతున్నారు.
అందుకే దానం నాగేందర్ స్పీకర్కు వివరణ ఇవ్వగానే ఈ ఆధారాల మేరకు అనర్హత వేటు తప్పదు.అంతకుముందే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి.. ఆ తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేస్తారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఇదిలాఉండగా, దానం నిన్న మీడియాతో మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని.. సీఎం ఆదేశిస్తే రాజీనామా చేస్తానని ప్రకటించారు. తనకు ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం, ఓడడం కొత్త కాదని ప్రకటించారు. తానే మళ్లీ గెలుస్తానని ధీమా సైతం వ్యక్తంచేశారు. రానున్న ఎన్నికల్లో ఎంఐఎం మద్దతుతో జీఎచ్ఎంసీ ఎన్నికలు గెలుస్తామని చెప్పారు. అదే జరిగితే ఖైరతాబాద్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు ఎక్కువే ఉన్నారు.మరో వైపు అధికారపార్టీ మద్దతు ఉంటుంది. దీంతో జూబ్లీహిల్స్ తరహాలోనే ఫలితాలు వచ్చే చాన్స్ ఉంది.
ఇక బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు. కేవలం పార్టీ ఫిరాయింపులను మాత్రమే చూపించి బైపోల్లో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కేసీఆర్ ఈసారి వచ్చి ప్రచారం చేస్తారా? అంటే క్లారిటీ లేదు. ఆయన వస్తే మాత్రం ఫలితాలను భిన్నంగా చూడాల్సి ఉంటుంది. మరల కేటీఆర్ మీద ఈ బాధ్యత ఉంటే.. జూబ్లీహిల్స్ ఫలితం రిపీట్ కావొచ్చని చర్చ జరుగుతున్నది. దానం మీద నియోజకవర్గంలో వ్యతిరేకతన క్యాచ్ చేసుకుని,వారి హయాంలో నగరంలో చేసిన అభివృద్ధిని ఎలాగూ చెప్పుకుంటారు.దానికి తోడు ముస్లిం ఓటర్లను తమవైపునకు తిప్పుకుంటే గులాబీ పార్టీకి విజయం దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇదిలాఉంటే గత బీఆర్ఎస్ అవినీతిని మరోసారి అధికార పార్టీ కార్నర్ చేయడం పక్కా.. దీంతో విజయం కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందా? బీఆర్ఎస్కు దక్కుతుందా? తెలియాలంటే వేచిచూడాల్సిందే.