Asifabad Municipal: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం, నెలకొంది. చేతికి అందాల్సిన ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ పీఠంపై అంతర్గత కుమ్ములాటలతో సొంత పార్టీ నేతల వెన్నుపోటు’ వల్ల ప్రత్యర్థి పార్టీ అయిన బీఆర్ఎస్ (BRS) వశం కావడంతో జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డెక్కారు. ఈ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ డీసీసీ అధ్యక్షురాలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె నివాసం ముందు కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున బైఠాయించారు. ఈ ఉత్కంఠభరిత రాజకీయ పరిణామాల్లో అందరినీ విస్మయానికి గురిచేసింది. సొంత పార్టీ నేతల ప్రవర్తన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉండి, స్వయంగా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో ఉన్న నాయకుడి భార్య, అనూహ్యంగా బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థికి మద్దతు పలకడం పార్టీని కోలుకోలేని దెబ్బ తీసింది. మెజారిటీ సాధించే అవకాశం ఉన్నా, కీలక సమయంలో సొంత నేతలే ప్రత్యర్థి వర్గంతో చేతులు కలపడంతో ఆసిఫాబాద్ మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లిందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు.
Also Read: Suspicious Death: నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం.. పొలంలో మైననర్ బాలిక మృతి..!
పార్టీకి జరిగిన ఈ పరాభవాన్ని తట్టుకోలేక మాజీ డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు, కౌన్సిలర్ కార్తీక్ బహిరంగంగానే కన్నీళ్లు పెట్టుకున్నారు. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న కార్యకర్తలకు ఈ పరిణామం తీరని అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణను గాలికొదిలేసి, పదవుల కోసం పాకులాడే వారిని అరికట్టడంలో ప్రస్తుత డీసీసీ నాయకత్వం పూర్తిగా విఫలమైందని వారు విమర్శించారు. డీసీసీ అధ్యక్షురాలి ఇంటి ముందు బైఠాయించిన కాంగ్రెస్ శ్రేణులు గంటల తరబడి నిరసనను కొనసాగించారు. ఈ సందర్భంగా వారు జిల్లా నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీకి పట్టున్న మున్సిపాలిటీలో పీఠాన్ని కాపాడుకోలేకపోయినందుకు డీసీసీ అధ్యక్షురాలు వెంటనే పదవికి రాజీనామా చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలిపి పార్టీకి ద్రోహం చేసిన యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వారి కుటుంబ సభ్యులను తక్షణమే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి తొలగించాలి కోరుతున్నారు. వ్యవహారంపై రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం స్పందించి, జిల్లాలో పార్టీని ప్రక్షాళన చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఆసిఫాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితం కేవలం ఒక పదవిని కోల్పోవడమే కాకుండా, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత బలహీనతలను బయటపెట్టింది. నమ్మకద్రోహానికి పాల్పడిన వారిపై అధిష్టానం కఠిన చర్యలు తీసుకోకపోతే, రాబోయే రోజుల్లో పార్టీ మరింత నష్టపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.