హైదరాబాద్ మహా నగరంలోని సంపన్న వర్గాలే లక్ష్యంగా సాగుతున్న ఒక అంతర్రాష్ట్ర దొంగతనాల ముఠాను హైదరాబాద్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. జూబ్లీహిల్స్లోని ఒక ప్రముఖ నివాసంలో జరిగిన రూ. 1.3 కోట్ల విలువైన భారీ దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు, ఈ ముఠాకు చెందిన ఐదుగురు సభ్యులను అరెస్ట్ చేశారు. నిందితులందరూ నేపాల్ దేశానికి చెందిన వారని సమాచారం. అయితే, ఈ ముఠాకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న వ్యక్తితో పాటు మరొకరు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
కుట్ర వెనుక ‘ఇన్సైడర్’ వ్యూహం..
పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల ఫిబ్రవరి 5వ తేదీన జూబ్లీహిల్స్ వంటి అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఈ దొంగతనం జరిగింది. ఈ ముఠా అనుసరించే పద్ధతి (Modus Operandi) అత్యంత ప్రమాదకరంగా ఉంది. సంపన్న కుటుంబాల ఇళ్లలో పనివారగా ఒక ముఠా సభ్యుడిని చేర్పించడం వీరి ప్రధాన వ్యూహం. ఆ వ్యక్తి ఇంట్లోని భద్రతా ఏర్పాట్లు, యజమానుల రాకపోకలు, విలువైన వస్తువుల వివరాలను నిశితంగా గమనించి ముఠాకు సమాచారం అందిస్తారు.
జూబ్లీహిల్స్ ఘటనలో, సదరు ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషి కీలక పాత్ర పోషించింది. యజమానులు ఇంట్లో లేని సమయాన్ని చూసి, ఆమె ఇంట్లోని వంటమనిషిని, వాచ్మెన్ను మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసింది. అనంతరం ఇద్దరు ముఠా సభ్యులను లోపలికి రప్పించి, రూ. 1.3 కోట్ల విలువైన బంగారం మరియు వెండి ఆభరణాలను దోచుకున్నారు. ఈ భారీ చోరీ తర్వాత నిందితులు నేపాల్కు పారిపోయేందుకు ప్లాన్ చేశారు.
పోలీసుల వేట – అరెస్టులు..
సాంకేతిక ఆధారాలు, హ్యూమన్ ఇంటెలిజెన్స్ సాయంతో రంగంలోకి దిగిన పోలీసులు, గాలింపు చేపట్టి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో కొందరు నేరుగా దొంగతనంలో పాల్గొనకపోయినా.. నిందితులకు ఆశ్రయం కల్పించడం, ఆర్థిక సహాయం చేయడం మరియు పారిపోవడానికి సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి చోరీకి గురైన ఆభరణాలతో పాటు మొబైల్ ఫోన్లు మరియు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముఠాకు నాయకత్వం వహిస్తున్న జీవన్ (అలియాస్ జిబన్ బహుదూర్ చంద్) ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతను గతంలో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠా నగరంలోని మరికొన్ని హై-ప్రొఫైల్ ప్రాంతాల్లో కూడా ఇదే తరహాలో దొంగతనాలు చేయడానికి పథకం వేసినట్లు విచారణలో తేలింది. త్వరలోనే మిగిలిన ఇద్దరు నిందితులను పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు. సంపన్న వర్గాలు తమ ఇళ్లలో పనివారలను నియమించుకునేటప్పుడు వారి పూర్వాపరాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
ALSO READ: West Bengal Murder: దారుణ హత్య.. ముక్కలు ముక్కలుగా నరికేసి, మూడు చోట్ల పడేసి.. చివరకు?