![](https://bigtvlive.com/wp-content/uploads/2022/11/kcr-bandi-1.jpg)
BANDI SANJAY : తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం హాట్ టాపిక్ గా నడుస్తోంది. బీజేపీ-టీఆర్ఎస్ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో కూర్చుని మొయినాబాద్ ఫామ్హౌస్ స్క్రిప్టు రాశారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ ఢిల్లీ నుంచి రాగానే డీజీపీతో సమావేశమై ఫామ్హౌస్ డ్రామా నడిపించారని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి తన కుమార్తెను కాపాడేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మద్యం కుంభకోణం కేసులో కవితను ఎవరూ రక్షించలేరని బండి సంజయ్ స్పష్టం చేశారు.
ఫామ్హౌస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు నేరుగా ప్రగతిభవన్కు ఎందుకు వెళ్లారని బండి సంజయ్ నిలదీశారు.కేసీఆర్ చెబుతున్న తుషార్కు బీజేపీతో ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో సీబీఐకి అనుమతి రద్దు చేస్తూ ఆగస్టు 30న జీవో జారీ చేయడంపై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. కుమారుడు, కుమార్తెను రక్షించుకునేందుకు కేసీఆర్ ఏమైనా చేస్తారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న కేసీఆర్.. 37 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారన్నారు. ఎవరినైనా సరే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే బీజేపీలోకి చేర్చుకుంటున్నామని తెలిపారు. కేసీఆర్ కు తన పార్టీ ఎమ్మెల్యేలపై నమ్మకం లేదని బండి సంజయ్ ఆరోపించారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై కేసీఆర్ వద్ద ఆధారాలు ఉంటే కోర్టులో ఎందుకు సమర్పించలేదని బండి సంజయ్ నిలదీశారు. కోర్టులో ఉన్న అంశంపై ఎవరూ మాట్లాడవద్దని కేటీఆర్ ట్విట్ చేస్తే.. అదే అంశంపై కేసీఆర్ ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. కేటీఆర్ వద్దని చెప్పినందుకే కొప్పుల ఈశ్వర్కు ఉప ముఖ్యమంత్రి పదవిని కేసీఆర్ ఇవ్వలేదని బండి సంజయ్ ఆరోపించారు. మద్యం కుంభకోణంపై కేసీఆర్ ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.