వరంగల్ జిల్లా ముత్తోజిపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ అంత్యక్రియల వ్యవహారం ఇప్పుడు హైడ్రామాగా మారింది. పోలీసులు, బీజేపీ నేత బండి సంజయ్ మధ్య సాగుతున్న ఈ వివాదంలో వరుస ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు శంకర్ గౌడ్ భౌతిక కాయాన్ని నర్సంపేట ఆర్టీసీ డిపో వద్దకు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు, కార్మికులు పట్టుబడుతుండగా, శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు దానికి అనుమతి నిరాకరిస్తున్నారు. ఈ క్రమంలో శంకర్ గౌడ్ కొడుకు హేమంత్ను బీజేపీ నేతలు డిపో వద్దకు తీసుకెళ్లడం, పోలీసులు మృతదేహాన్ని తిరిగి అల్లుడి ఇంటికి తరలించడం వంటి పరిణామాలతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పరిస్థితి అదుపు తప్పుతుండటంతో వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ స్వయంగా రంగంలోకి దిగి, కేంద్ర మంత్రి బండి సంజయ్తో మంత్రి శ్రీధర్ బాబుని ఫోన్లో మాట్లాడించారు. శాంతిభద్రతల దృష్ట్యా సహకరించాలని, అంత్యక్రియలు సజావుగా సాగేలా చూడాలని డీజీపీ కోరినప్పటికీ, బండి సంజయ్ మాత్రం తన పట్టు వీడటం లేదు.
డిపో వద్ద నివాళి అర్పించేందుకు అనుమతి ఇచ్చే వరకు కదిలేది లేదని బండి సంజయ్ స్పష్టం చేయడంతో పోలీసులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. ఒకవేళ ఆయన వెనక్కి తగ్గని పక్షంలో, బండి సంజయ్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “శంకర్ గౌడ్ భౌతిక కాయంతో పోలీసులకు ఏం పని? శవాలతో రాజకీయం చేయాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమొచ్చింది?” అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. శంకర్ గౌడ్కు ఆర్టీసీతో 22 ఏళ్ల అనుబంధం ఉందని, ఆయన పని చేసిన డిపో వద్ద కేవలం 5 నిమిషాల పాటు భౌతిక కాయాన్ని ఉంచి నివాళి అర్పించేందుకు అవకాశం ఇవ్వాలని కోరితే, ఇంత రాద్ధాంతం చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు.
శంకర్ గౌడ్ ఇంటి వద్ద టెంట్ వేసిన వారిని సైతం పోలీసులు బెదిరిస్తున్నారని, ప్రభుత్వం చెప్పినట్లు వినకపోతే రావాల్సిన బెనిఫిట్స్ (Benefits) కూడా అందకుండా చేస్తామని కుటుంబ సభ్యులను భయపెడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. “ఆర్టీసీ కార్మికులు ఏమైనా దొంగలా? లంగలా? తమ సహచరుడిని కడసారి చూసుకునే హక్కు కూడా వారికి లేదా?” అని నిలదీశారు. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా తాను బాధ్యత తీసుకుంటానని, డిపో వద్ద నివాళి అర్పించిన తర్వాతే దహన సంస్కారాలు జరిపిస్తామని ఆయన స్పష్టం చేశారు.
శవ రాజకీయాలు చేస్తున్నామంటూ తమపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను బండి సంజయ్ కొట్టిపారేశారు. గతంలో ఆర్టీసీ డ్రైవర్ బాబు మరణం సమయంలో అప్పటి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతలు చేసినవి శవ రాజకీయాలు కావా? అని ఆయన ప్రశ్నించారు. నివాళి అర్పించడం అనేది కనీస మానవతా దృక్పథమని, దీనిని అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన విమర్శించారు. ప్రస్తుతానికి శంకర్ గౌడ్ అంత్యక్రియలపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
Read Also: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండ.. రూ. 10 లక్షల పరిహారం, ఉద్యోగ హామీ!