ఆర్టీసీ సమ్మె పై బీఆరెస్ నేతలు సంఘీభావం ప్రకటించారు. శ్రీనివాస్ యాదవ్, హరీశ్రావులు ఇప్పటికే ఆర్టీసీ సమ్మెలో పాల్గొన్నారు. గొంతెమ్మ కోర్కెలు కాదు.. తీర్చండని ఈ నేతలు మాట్లాడటంతో నవ్విపోదురు గాక మాకేటి సిగ్గు.. అన్నట్టుగానే ఉంది వీరి వ్యవహారమని అనుకుంటున్నారు ప్రస్తుతం. 2019లో అక్టోబర్ 5న కేసీఆర్ పాలనలో జరిగిన ఆర్టీసీ సమ్మె దేశంలోనే చరిత్రకెక్కింది. దాదాపు 50 రోజుల పాటు సాగిన ఈ సమ్మెపై కేసీఆర్ ఉక్కుపాదం మోపారు. వేలాది మంది ఉద్యోగాలు పీకేశారు. యూనియన్ల గుర్తింపు రద్దు చేశారు. ఇకపై చర్చలు యూనియన్లతో సాగవు.. మధ్యలో మీరెవరయా..? అని వారిని హేళనగా చూశారు. ప్రస్తుతం కొనసాగుతున్న సమ్మె డిమాండ్లలో ఇది కూడా ఉంది.
యూనియన్ల గుర్తింపులను మళ్లీ యధాతథంగా కొనసాగించాలని. ఈ ఒక్క డిమాండ్ చాలు నాటి కేసీఆర్ పాలన తీరును.. ఆర్టీసీ పట్ల ఆయన వ్యవహరించిన వైఖరి గురించి అనే చర్చ ఇప్పుడు వస్తున్నది. ఉద్యమ దళపతిగా పేరు పొంది. తెలంగాణ ఉద్యమ జేఏసీని నేనే ఏర్పాటు చేశానని పలు వేదికల మీద గర్వంగా చెప్పుకున్న ఈయనేనా.. యూనియన్ల గురించి ఇంత చీప్గా మాట్లాడేది..? అని అంతా ముక్కున వేలేసుకున్నారు. అంతే కాదు.. ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ చూపిన కఠినత్మం.. కీలక నిర్ణయాలు.. ఉక్కు పాదం మోపడం లాంటి చర్యలు తెలంగాణ వాదులను విస్తుగొలిపేలా చేశాయి. ఉమ్మడి ఏపీలో సీఎంలు కూడా ఇంతటి దారుణాలకు పాల్పడలేదనే విమర్శలను ఎదుర్కొన్నది కేసీఆర్ సర్కార్.
తను చెప్పిందే వేదం.. నాకే ఎదురు తిరుగుతారా? నేను తెచ్చిన తెలంగాణలో నాకేం చేయాలో తెలుసు..? అనే గర్వం ఆయన ప్రతీ కదలికలో తెలంగాణ వాదులు గమనించారు. ఉద్యమ సమయంలో ఒకలా.. రాష్ట్రం వచ్చిన తొలి రోజుల్లో మరోలా.. సీఎంగా పాలన సాగిస్తున్న క్రమంలో ఇంకోలా.. ఇలా రకరకాలుగా ఆయన మారిన తీరు.. ఆలోచనల సరళి.. అన్నీ బయటపడుతున్న తరుణంలో మరో కేసీఆర్ చూశామంటున్నారు ఆర్టీసీ కార్మికులు. ఆర్టీసీ కార్మికులే కాదు.. చాలా మంది ఉద్యమకారులకు, తెలంగాణ వాదులకు కేసీఆర్ వైఖరిని జీర్ణించుకోలేకపోయారు. దేశం మొత్తం ఆనాడు ఆర్టీసీ సమ్మె, కేసీఆర్ తీరుపై నివ్వెరపోయిందంటే అతిశయోక్తి కాదు. పలువురు ప్రాణాలొదిరారు.
కేసీఆర్ మొండి వైఖరికి కార్మికలోకంలో తీవ్ర ఆర్థిక నష్టం జరిగింది. కుటుంబాలు కుదేలైపోయాయి. ఈ ఆర్టీసీ సమ్మెను అణచడం ద్వారా.. ఇతర సెక్షన్లకు కూడా ఓ వార్నింగ్ ఇవ్వదలుచుకున్నట్టుగానే కేసీఆర్ వైఖరి సాగిందనే అభిప్రాయలు అప్పుడు వ్యక్తమయ్యాయి. తన మాటకు ఎదురు తిరిగితే పుట్ట గతులుండవనే సంకేతాలు వెళ్లాయి. ఇప్పుడు ఇంతలా మాట్లాడుతున్న బీఆరెస్ నేతలకు.. తమ బాస్ ఆనాడు అనుసరించిన విధానాలు, పద్దతులు తెలుసు. కానీ జనం అన్నీ మరిచిపోతారని కేసీఆర్ అన్నట్టుగా.. అంతా మరిచిపోయే ఉంటారని భావించి ఉంటారు. కానీ ఇప్పుడు ఆనాటి కేసీఆర్ పాలనలో జరిగిన యాభై రోజుల ఆర్టీసీ సమ్మె , చేదు అనుభవాలను యాది చేసుకుంటున్నారు.
యూనియన్లే లేకుండా చేయాలనే ఆలోచన వెనుక ఆయన లోపల దాగున్న నియంతృత్వ పోకడలకు అద్దం పట్టిందనే వాదన ఇంకా బలంగానే ఉంది. అది కార్మికలోకం మరిచినట్టు లేదు. అందుకే ఇప్పుడు కేసీఆర్ ఈ ఆర్టీసీ సమ్మెపై పల్లెత్తు మాట.. కాదు కాదు కనీసం ప్రకటన కూడా విడుదల చేయలేడు. ఎందుకంటే.. తనేం చేశాడో తనకు తెలుసు. అప్పటి పరిస్థితులు కార్మిక లోకానికీ తెలుసు….అని చర్చించుకుంటున్నారు.