Bhadradri District: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అశ్వారావుపేట–ఖమ్మం నేషనల్ హైవేపై అచ్యుతాపురం స్టేజి వద్ద జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ కీలక పట్టుబాటు జరిగింది. అనుమానాస్పదంగా కనిపించిన తమిళనాడు రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న డీసీఎం కంటైనర్ను పోలీసులు ఆపి తనిఖీ చేయగా, లోపల భారీగా గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు.
వాహనం క్యాబిన్లో ప్రత్యేకంగా సీక్రెట్ లాకర్ ఏర్పాటు చేసి, అత్యంత చాకచక్యంగా సుమారు 200 కేజీల గంజాయిని దాచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించిన అనంతరం గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన గంజాయి బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.98 లక్షల వరకు విలువ ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
ప్రాథమిక విచారణలో ఈ గంజాయిని ఒడిశా రాష్ట్రం నుంచి తమిళనాడులోని చెన్నైకి అక్రమంగా తరలిస్తున్నట్లు వెల్లడైంది. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి గంజాయితో పాటు అక్రమ రవాణాకు ఉపయోగించిన డీసీఎం కంటైనర్తో పాటు ఎస్కార్ట్గా ఉపయోగించిన కార్లను కూడా సీజ్ చేశారు.
నిందితులు గంజాయి రవాణా కోసం పక్కా ప్రణాళికతో వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు. తనిఖీలను తప్పించుకునేందుకు సీక్రెట్ లాకర్ ఏర్పాటు చేయడంతో పాటు ఎస్కార్ట్ వాహనాలను ఉపయోగించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసుకు సంబంధించి మరికొందరు కీలక వ్యక్తులు ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు ఎవరైనా అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం అందిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఈ పట్టుబాటు జిల్లాలో డ్రగ్స్ మాఫియాపై పెద్ద దెబ్బగా పోలీసు అధికారులు పేర్కొన్నారు.