Chamala Kiran Kumar Reddy: భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇటీవల జరిగిన డీసీసీ నూతన అధ్యక్షుల సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు కలిసి కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని స్పష్టంగా వ్యాఖ్యానించారు.
డీసీసీ అధ్యక్షుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ చరిత్ర, విలువలు, అంతర్గత ప్రజాస్వామ్యంపై అవగాహన కల్పించేందుకే అని ఎంపీ చామల కిరణ్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి 140 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉందని, ప్రజాస్వామ్యానికి పునాది వేసిన పార్టీ కాంగ్రెస్ అని సీఎం చెప్పిన మాటలను రాజకీయ లాభం కోసం తప్పుగా అర్థం చేసుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో మల్టిపుల్ లీడర్షిప్ సంప్రదాయం ఉందని, ప్రతి కార్యకర్తకు ఎదిగే అవకాశం ఉంటుందని సీఎం చెప్పిన మాటలను వక్రీకరించడం దుర్మార్గమైన రాజకీయ వ్యూహమని పేర్కొన్నారు.
హిందూ ధర్మం గురించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా బీజేపీ, బీఆర్ఎస్ తప్పుదోవ పట్టిస్తున్నాయని ఎంపీ అన్నారు. హిందువుల్లో అనేక రకాల దేవుళ్లు, దేవతలు ఉంటారని, భిన్నత్వంలో ఏకత్వమే మన సంస్కృతి అని సీఎం చెప్పారని తెలిపారు. అయితే కులం, మతాన్ని కించపరిచేలా సీఎం ఎక్కడా మాట్లాడలేదని, అతని వ్యాఖ్యలను మతపరంగా మలిచే యత్నం చేయడం ప్రమాదకరమైన రాజకీయ ధోరణిగా అభివర్ణించారు.
2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ వరుస పరాజయాలతో రాజకీయంగా కుదేలైందని, అదే నిరాశలో బీజేపీతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారానికి పాల్పడుతోందని చామల కిరణ్ రెడ్డి విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి పార్లమెంట్ ఓటముల వరకు బీఆర్ఎస్ ఓటమి చవిచూసిందని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదని ఎద్దేవా చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి స్థాయిని తగ్గించి తెలంగాణ ప్రజల మనసుల్లో.. ఆయనపై నెగిటివ్ అభిప్రాయం సృష్టించాలనే కుట్రతోనే ఈ దుష్ప్రచారం జరుగుతోందని ఎంపీ ఆరోపించారు. ప్రజల సమస్యలపై పోరాడాల్సిన బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు ధర్నాలు, పంచాయతీలు పెట్టి రాజకీయ లబ్ధి పొందడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి ‘తెలంగాణ రైజింగ్ 2047’ పేరుతో భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నారని, ఆ దిశగా పలు కీలక కార్యక్రమాలు చేపడుతున్నారని చామల కిరణ్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను గుర్తింపు పొందేలా క్రీడలు, పరిశ్రమలు, పెట్టుబడులపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. హైదరాబాదు నగరంలో మెస్సిలాంటి అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారుడిని తీసుకువచ్చి మ్యాచ్ నిర్వహించడం కూడా.. రాష్ట్ర గౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నమేనని చెప్పారు.
ప్రజల సంక్షేమం, రైతులు, మహిళలు, యువత అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని, అదే ఓర్వలేక ప్రతిపక్షాలు దుష్ప్రచారానికి దిగుతున్నాయని అన్నారు.
Also Read: బాలుడిపై కుక్కలు దాడి ఘటన, సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం, అధికారులకు ఆదేశాలు
బీజేపీ, బిఆర్ఎస్ ప్రజలకు స్పష్టమైన విధానాలు, విజన్ లేకనే కులం, మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించిన చామల కిరణ్ రెడ్డి, ప్రజలు ఈ కుట్ర రాజకీయాలను గుర్తించి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల సంపూర్ణ మద్దతు కొనసాగుతోందని, రానున్న రోజుల్లో ప్రతిపక్షాల రాజకీయ ఆటలు సాగవని ధీమా వ్యక్తం చేశారు.