Chamala Kiran Kumar Reddy: భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై.. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఘాటైన కౌంటర్ ఇస్తూ, రాజకీయ వేదికపై కాకుండా వ్యక్తిగత వ్యాఖ్యలతో ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తే ప్రజలు పట్టించుకోరని హెచ్చరించారు. కేటీఆర్ వ్యవహార శైలిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన చామల కిరణ్ రెడ్డి, ఇది రాజకీయ విమర్శ కాదని, కేవలం ఫ్రస్టేషన్తో చేసిన వ్యాఖ్యలని పేర్కొన్నారు.
కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డితో ఫుట్బాల్ ఆడాలని తహతహలాడుతున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కేటీఆర్ మెస్సీలా భావించి రేవంత్ రెడ్డితో ఫుట్బాల్ ఆడాలనుకుంటున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మీతో ఫుట్బాల్ ఆడరు. ఇప్పటికే రాజకీయాల్లో మిమ్మల్ని ఫుట్బాల్లా ఆడుకుంటున్నారు అంటూ తీవ్రంగా ఎద్దేవా చేశారు. రాజకీయ స్థాయిలో నిలబడే సామర్థ్యం లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కేటీఆర్ పరిపక్వతలేమికి నిదర్శనమని అన్నారు.
రేవంత్ రెడ్డికి రాజకీయాల్లో ఎలాంటి గాడ్ ఫాదర్ లేరని, బ్యాక్గ్రౌండ్ లేకుండా రాజకీయ ప్రయాణం ప్రారంభించి సీఎం స్థాయికి ఎదిగారని చామల కిరణ్ రెడ్డి గుర్తు చేశారు. జెడ్పీటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి, కష్టపడి ఎదిగిన నాయకుడు రేవంత్ రెడ్డి. కేటీఆర్లా అమెరికా నుంచి పారాచ్యూట్లో సిరిసిల్లకు రాలేదు అంటూ వ్యాఖ్యానించారు. తండ్రి పిలిచారని రాజకీయాల్లోకి వచ్చి, అప్పటికే ఉన్న నాయకులను పక్కన పెట్టి సిరిసిల్లలో పోటీ చేసి వంద ఓట్ల తేడాతో గెలిచిన చరిత్ర కేటీఆర్దని విమర్శించారు.
తనను తాను వర్కింగ్ ప్రెసిడెంట్గా శిఖరాగ్రానికి చేరుకున్నానని.. కేటీఆర్ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరమని అన్నారు. మీ బావ, చెల్లెలు, కార్యకర్తలు కేటీఆర్కు ఐరన్ లెగ్ ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రజలు ఇప్పటికే మీ రాజకీయ బలం ఎంతుందో తీర్పు చెప్పారు అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యే పరిస్థితి రావడానికి ఆయన పాలన విధానాలే కారణమని, రాజకీయంగా క్రియాశీలకత కోల్పోయేలా చేసుకున్నారని విమర్శించారు.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గుండు సున్నా రావడం, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి ఇవన్నీ కేసీఆర్ రాజకీయ వారసత్వానికి నిదర్శనమని చామల కిరణ్ రెడ్డి పేర్కొన్నారు. కేటీఆర్ ఆడాల్సిన రాజకీయాన్ని ఆడటం లేదు. ఇంకా ఫుట్బాల్ ఏం ఆడతారు? అంటూ తీవ్రంగా ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ వల్లే కేటీఆర్లో ఫ్రస్టేషన్ పెరిగిందని, అభివృద్ధి, పెట్టుబడుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయాలు బీఆర్ఎస్ నేతలను అసహనానికి గురి చేస్తున్నాయని అన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలతోనే కేటీఆర్ రాజకీయ భవిష్యత్ స్పష్టమైందని, ఇక ప్రజలు బీఆర్ఎస్ వైపు చూడడం లేదని వ్యాఖ్యానించారు. “నువ్వు, మీ బావ రోజుకో ప్రెస్మీట్ పెట్టినా ప్రజలు పట్టించుకోరు” అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తోందని, భవిష్యత్తులో మరిన్ని హామీలు నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని చెప్పారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలవడానికి 50 సార్లు ఢిల్లీ వెళ్లారని తెలిపారు.
కేసీఆర్ నియంతలా పాలన చేసి, బీజేపీ నాయకులతో కలిసి రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో వెళ్లే ప్రతి రూపాయిని తిరిగి తెలంగాణకు తీసుకురావడమే రేవంత్ రెడ్డి లక్ష్యమని, అందుకే ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని వివరించారు. కేటీఆర్ సొల్లు కబుర్లు మాట్లాడితే తెలంగాణ ప్రజలు మీవైపు చూడరు అని హెచ్చరించారు.
Also Read: మేడారం మహా జాతర 2026.. పోస్టర్ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో బీఆర్ఎస్ మనుగడ కోల్పోయిందని, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన తర్వాత పార్టీకి తెలంగాణతో సంబంధమే లేకుండా పోయిందని చామల కిరణ్ రెడ్డి విమర్శించారు. కేటీఆర్ భావోద్వేగాలతో కాకుండా ప్రాక్టికల్గా ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచిస్తూ, రాజకీయాల్లో నిలవాలంటే ప్రజల విశ్వాసమే అసలైన బలం అని స్పష్టం చేశారు.