Mahesh Kumar Goud : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంది. నేతలంతా విజయోత్సవాలు చేసుకున్నారు. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. ఈ ఐదేళ్ళు కాదు.. రానున్న మరో పదేళ్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందన్నారు.
తెలంగాణలో ప్రభుత్వం కొలువు తీరి ఏడాది సందర్భంగా బిగ్ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏడాది పాటు అధ్బుతమైన పాలన అందించామన్నారు. రానున్న సంవత్సరాలకు ప్రణాళిక సిద్ధమైందన్నారు. వాటిని త్వరలో అమలు చేస్తామన్నారు. మా ప్రభుత్వానికి ఇప్పటికైతే ఐదుకి 4. 5 మార్కులు ప్రజలు ఇస్తున్నారని వివరించారు.
ఈసారి గ్రేటర్లో కాంగ్రెస్దే హవా ఉండబోతోందన్నారు టీపీసీసీ. లోకల్ బాడీ ఎన్నికల్లో 80 సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్ళు కాదు రానున్న 10 నుంచి 15 ఏళ్లు సుస్థిరంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని నమ్ముతున్నామని మనసులోని మాట బయటపెట్టారు.
విప్లు, ఎమ్మెల్సీలు, నామినేట్ పోస్ట్ విషయంలో సామాజిక న్యాయాన్ని పాటించామని తెలిపారు. ఉద్యమం నుంచి ఉద్భవించిన తెలంగాణకి ప్రతిరూపంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని వివరించారు. బతుకమ్మను తొలగించామని, దాన్ని వాళ్ళ పేటెంట్గా బీఆర్ఎస్ సీన్ చేసే ప్రయత్నం చేస్తోందన్నారు.
ALSO READ: తెలంగాణలో మరోసారి భూకంపం.. భయంతో పరుగులు
వెలమ సామాజిక వర్గంపై షాద్ నగర్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను వ్యక్తిగతంగా చూస్తున్నామని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. కులం గురించి మతం గురించి వేరొక వ్యక్తి గురించి మాట్లాడటం ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ సమర్థించదన్నారు. ముఖ్యమంత్రితో ఈ విషయంపై చర్చించి షాద్నగర్ ఎమ్మెల్యేను వివరణ ఇవ్వమని కోరామని, ఇవాళ లేదా రేపు గానీ సమాధానం ఇస్తారన్నారు.
మంత్రి కొండా సురేఖ గతంలో నాగార్జున ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు వివరణ ఇచ్చారని, ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా గట్టిగా చర్యలు తీసుకుంటామన్నారు. దాదాపు అన్ని హామీలు పూర్తి చేశామని, త్వరలో మరికొన్ని హామీలు త్వరలోనే నెరవేర్చబోతున్నా మన్నారు. ప్రచారంలో ముందుకు వెళ్లే విధంగా కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశామన్నారు. ఏడాది పాలన హ్యాపీగా ఉందన్నారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్.