బీజేపీ అధికంగా డివిజన్లను కైవసం చేసుకోగా..సంపూర్ణ మెజార్టీ లేకపోవడంతో రెండో స్థానంలో నిలిచిన అధికార కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మద్దతుతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. మేయర్ ఎన్నిక సమయంలోనూ కాంగ్రెస్, బీజేపీ మధ్య కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఇక కాంగ్రెస్ స్థానికంగా ఎంఐఎంతో పొత్తుతో అది కాస్త తారాస్థాయికి చేరినట్టు తెలుస్తున్నది. రెండ్రోజుల కిందట బాన్సువాడ రాజీవ్ నగర్ చౌరస్తాలో రెండు గ్రూపులు రాళ్లదాడులు జరుపుకున్నాయి.ఈ ఘటనలో పలువురు పోలీసులకు సైతం గాయాలయ్యాయి.ఆ గొడవ కాస్త సర్దుమణిగిందో లేదో అనుకునే సరికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మధ్య మాటల యుద్ధం నెలకొంది.
కామారెడ్డిలో బీజేపీ గుర్తుమీద తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కాటిపల్లికి ఓ రికార్డు ఉన్నది.ఆయన గత ఎన్నికల్లో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని, మాజీ సీఎం కేసీఆర్ను ఓడించారు. వారిద్దరిని ఓడించి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వగా అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది. ఆయనకు స్థానికంగా మంచిపేరుంది. ఇదంతా ఓవైపు అయితే కామారెడ్డిలోని డిగ్రీ కళాశాల ప్రభుత్వ భూముల అంశంలో ఎమ్మెల్యే అవినీతికి పాల్పడ్డారని షబ్బీర్ అలీ ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ఇరు పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇదే అంశంపై కలెక్టరేట్లో తేల్చుకోవడానికి రావాలని ఎమ్మెల్యే పిలుపునివ్వగా.. అక్కడ కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. వాహనాలను కొందరు ధ్వంసం చేశారు.
దీంతో బీజేపీ ఛలో కామారెడ్డికి పిలుపునిచ్చింది. బీజేపీ కీలక నేతలు కామారెడ్డికి వస్తే గొడవ ఎక్కడ పెద్దది అవుతుందోనని పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టులు చేశారు.హైదరాబాద్లోనే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావులను ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు.మరికొందరిని కూడా ఇళ్ల నుంచి బయటకు వెళ్లనివ్వలేదు. ఈ ఘటనపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఘాటుగా స్పందించారు. దాడులకు పాల్పడే వారిని అరెస్టు చేయకుండా బీజేపీ నేతలను ఎలా అరెస్టు చేస్తారు? వారి మీద కేసులు ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. అయినప్పటికీ ఈ గొడవ అంత సులువుగా కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు.
తాజాగా డిగ్రీ కళాశాల భూముల అంశంలో తాను అవినీతికి పాల్పడినట్లు ఆధారాలతో సహా నిరూపిస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని షబ్బీర్ అలీకి కాటిపల్లి సవాల్ విసిరారు.డిగ్రీ కళాశాల భూముల వివరాలు ఇవ్వాలని, వాస్తవాలను బయటపెట్టాలని కామారెడ్డి కలెక్టర్ను ఎమ్మెల్యే కలిసి విన్నవించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. షబ్బీర్ అలీ కావాలనే ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. డిగ్రీ కళాశాల భూముల వివరాలను ఆర్టీఐ ద్వారా కోరామని, ప్రభుత్వం నుంచి సమాచారం కూడా అడిగామన్నారు. కాలేజీ భూముల విషయంలో తాను ఒక్క గజం అవినీతి చేసినట్లు నిరూపించినా పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. నియోజకవర్గంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకూడదనే ఉద్దేశంతో సహనంతో ఉంటున్నాని వివరించారు. తనను కలవడానికి వస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకులను పోలీసులు అడ్డుకుంటున్నారని, మరి కాంగ్రెస్ నాయకులను ఎందుకు అడ్డుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.