Bandi Sanjay: కరీంనగర్ తీర్పు స్ఫూర్తితో భాజాప్తా.. హైదరాబాద్ పై కాషాయ జెండా ఎగరేయబోతున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఓవైసీ కళ్లల్లో ఆనందం చూసేందుకు రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేసి ఒక ముక్క ఒవైసీకి రాసిచ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అదే రేవంత్ రెడ్డి పాలిట మరణ శాసనం కాబోతోందని హెచ్చరించారు. హైదరాబాద్ తోపాటు సైబరాబాద్, మల్కాజ్ గిరి కార్పొరేషన్లపై కాషాయ జెండా ఎగరేయబోతున్నామని, ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా? అని ఎదురు చూస్తున్నామని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ రావు సహా స్థానిక బీజేపీ నేతలతో కలిసి బండి సంజయ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
ఈ గెలుపు తనకు పట్టలేని సంతోషాన్నిచ్చిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుమ్కక్కై ఎన్నో కుట్రలు చేశాయని, ఓటుకు రూ.7 వేలు ఇచ్చాయని, చివరకు బీజేపీ అభ్యర్థులు, నాయకులను ప్రలోభ పెట్టేదుకు అనేక కుట్రలు చేశారని పేర్కొన్నారు. అయినా వారి పాచిక పారలేదని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆయన బడే భాయ్ ఎంఐఎం ఓవైసీ బ్రదర్స్ ను పిలిచి రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మలేదని చురకలంటించారు. తెలంగాణలో తొలిసారి కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగరేసి రికార్డు సృష్టించామని బండి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండాను ఎగరేయడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. ఈ అద్భుత అవకాశాన్ని తమకు అందించి మోడీ ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని చెప్పారు.’
Also Read: Telangana Municipal Elections: కరీంనగర్ కార్పొరేషన్ కాషాయమయం.. ఫలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషి
సంజయ్ హిందుత్వం గురించే మాట్లాడతారని, అభివృద్ధి గురించి మాట్లాడరని, కరీంనగర్ కు నయాపైసా కూడా తేలేదంటూ పిచ్చి కూతలు కూసిన వాళ్లకు ప్రజలు చెంపపెట్టు తీర్పు ఇచ్చారని, కర్రు కాల్చి వాతపెట్టారని పేర్కొన్నారు. కరీంనగర్ ప్రజలను ఆదుకునేది, అభివృద్ధి చేసేది మోడీ ప్రభుత్వమేనని నమ్మి ఆదరించారన్నారు. ఐదేళ్లలో కరీంనగర్ అభివృద్ధి ఏవిధంగా చేస్తామో చేతల్లో చూపిస్తామన్నారు. తాను ఒక సామాన్య కార్యకర్తనని, రెండుసార్లు కార్పొరేటర్ గా గెలిచానని, మూడుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయానని, రెండుసార్లు ఎంపీగా గెలిచినానని, అలాంటి తనకు బీజేపీ నాయకత్వం రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించిందన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చిందని, కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించిందన్నారు. కరీంనగర్ ప్రజలు బీజేపీనే నమ్మారని, అందుకే ఇప్పుడు 30 సీట్లు గెలిపించారన్నారు. కొన్ని కారణాలవల్ల మరో ముగ్గురికి సీట్లు ఇవ్వలేకపోయినా కాషాయ జెండా కప్పుకుని తిరిగి గెలిచారన్నారు. మరో ముగ్గురు ఇండిపెండెంట్లు పార్టీలోకి వస్తున్నారన్నారు. అందరూ షాక్ తినేలా ఇతర పార్టీల్లో గెలిచిన అభ్యర్థులు కూడా బీజేపీలోకి రాబోతున్నారని బండి వ్యాఖ్యానించారు.
మాజీ మేయర్ సునీల్ రావుకు ఫోన్ చేసి బీజేపీకి మద్దతిస్తామని స్వచ్ఛందంగా చెబుతున్నారని, వారందరి సహకారం తీసుకుంటామని అభివృద్ధే లక్ష్యంగా అందరినీ కలుపుకుపోతామని సంజయ్ చెప్పారు. కరీంనగర్ ఎంఐఎం.. కాంగ్రెస్ తో సంసారం చేస్తోందని, బీఆర్ఎస్ కు కన్ను కొట్టిందనే విషయాన్ని ప్రజలు గమనించారన్నారు. గతంలో 7 సీట్లున్న ఎంఐఎంను 3 సీట్లకే పరిమితం చేశామని బండి చెప్పారు. ఎంఐఎం పార్టీ కార్యాలయ డివిజన్ లో ఆ పార్టీని బద్దలు కొట్టామని బండి తెలిపారు. ఎంఐఎంకు ఆదరణ ఉన్న కశ్మీర్ గడ్డ వంటి ప్రాంతాల్లోనూ బీజేపీ సత్తా చాటిందని కేంద్ర మంత్రి కొనియాడారు. మొత్తం 66 డివిజన్లలో సర్వే చేసి 56 మందికి కట్టర్ బీజేపీ కార్యకర్తలకే సీట్లు ఇచ్చామని, అందులో 33 మంది గెలిచారన్నారు. 100 ఓట్లలోపు తేడాతో మరో 10 మంది బీజేపీ అభ్యర్థులు ఓడిపోయారని తెలిపారు. కష్టపడి పనిచేసిన బీజేపీ కార్యకర్తలకు బండి హ్యాట్సాఫ్ చెప్పారు. పార్టీని నమ్ముకుని, చెప్పిన మాట విని నామినేషన్లను ఉపసంహరించుకుని పనిచేసిన బీజేపీ నాయకులకు భవిష్యత్తులో మంచి అవకాశాలిస్తామని సంజయ్ హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా కరీంనగర్ లో కాషాయ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి. కేంద్ర మంత్రిని భుజంపై ఎత్తుకుని కాషాయ శ్రేణులు ఊరేగించారు.
Also Read: Mahesh Kumar Goud: రేవంత్ సర్కార్కు ‘బ్రహ్మరథం’..! ప్రజా పాలనకే ప్రజల ఓటు.. మహేష్ కుమార్ గౌడ్