Telangana Municipal Elections: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ సరికొత్త చరిత్ర సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లను కైవసం చేసుకుని కాషాయ జెండాను ఎగురవేసింది. కరీంనగర్ కార్పొరేషన్ న్ లో బీజేపీ ఘనవిజయం సాధించి, మున్సిపల్ రాజకీయాల్లో విజయదుందుభి మోగించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తన సొంత నియోజకవర్గమైన కరీంనగర్లో అన్నీ తానై నడిపించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి స్థానికంగానే ఉండి, వార్డుల వారీగా వ్యూహరచన చేశారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు ఆయన పక్కా ప్రణాళికతో ముందుకు సాగారు. ముఖ్యంగా అధికార పక్షం దూకుడును అడ్డుకుంటూ, కేడర్లో ఉత్సాహం నింపుతూ ఆయన చేసిన కృషి ఫలితమే నేడు కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ ఖాతాలో చేరడానికి ప్రధాన కారణమైంది. కరీంనగర్ కార్పొరేషన్ లో మొత్తం 66 డివిజన్లు ఉండగా 30 డివిజన్లను కాషాయ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. 30 డివిజన్లలో విజయదుందుభి మోగించిన బీజేపీ సింగిల్ గానే మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోనుంది.
Also Read: Telangana Municipal Elections: మున్సి పోరులో కమలం డీలా.. జాతీయ నేతల ప్రచారం పనిచేయలేదా?
మరోవైపు నిజామాబాద్ కార్పొరేషన్ గెలుపు తీరాల వరకు చేరుకున్నట్లే చేరుకుని తృటిలో చేజారిపోయింది. ఎంపీ ధర్మపురి అర్వింద్ కృషి బూడిదలో పోసిన పన్నీరైంది. కొన్ని డివిజన్లలో అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ లోపలే అసమ్మతి, తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికీ, వాటిని తన వ్యూహాలతో చక్కదిద్ది విజయ తీరాలకు చేర్చాలనుకున్న శ్రమ వృథా అయింది. నిజామాబాద్ లో మొత్తం 60 డివిజన్లు ఉండగా 28 డివిజన్లను కాషాయ పార్టీ ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్ 17 డివిజన్లలో గెలిచి రెండో స్థానంలో నిలిచింది. ఎంఐఎం 14 డివిజన్లలను కైవసం చేసుకుంది మూడో స్థానంలో నిలిచింది. ఇక బీఆర్ఎస్ కేవలం ఒక్కటంటే ఒక్కటే స్థానానికి పరిమితమైంది. కాగా కాంగ్రెస్, ఎంఐఎం మిత్రపక్షాలుగా ఉన్నాయి. దీంతో కాషాయ పార్టీ సింగిల్ గానే 28 స్థానాల్లో గెలిచినా కాంగ్రెస్, ఎంఐఎం మిత్ర పక్షం కారణంగా నిజామాబాద్ కార్పొరేషన్ చేజారింది.
రాష్ట్రవ్యాప్తంగా మిశ్రమ ఫలితాలు వచ్చినప్పటికీ, కరీంనగర్ కార్పొరేషన్ ను కాషాయ పార్టీ కైవసం చేసుకోవడం బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. తొలిసారిగా నగర పాలక సంస్థల పీఠాన్ని దక్కించుకోవడం ద్వారా పట్టణ ఓటర్లలో బీజేపీకి ఉన్న పట్టు మరోసారి నిరూపితమైంది. బండి సంజయ్ సమన్వయం, పట్టుదల వల్లే ఈ అసాధ్యమైన విజయం సుసాధ్యమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విజయంతో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కేడర్ సంబురాల్లో మునిగిపోయింది. మున్సిపల్ పీఠంపై కమలం వికసించడం రాబోయే అసెంబ్లీ సమీకరణాలను సైతం ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది.
Also Read: Komatireddy Rajgopal Reddy: మంత్రిని కాకపోతే ముఖ్యమంత్రిని అవుతా.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!