Paddy Procurement: స్వేచ్ఛ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ పై ఏమాత్రం కంట్రోల్ లేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రైతు గోస బీజేపీ భరోసా పేరుతో రైతాంగం పడుతున్న బాధలను తెలుసుకునేందుకు యాత్ర చేపట్టినట్లు చెప్పారు. నాలుగు రోజుల పాటు అనేక జిల్లాల్లో పర్యటించి.. రైతాంగం ఆర్తనాదాలు విన్నామన్నారు. ధాన్యం కొనుగోళ్లు 80 శాతం పూర్తయ్యాయని ముఖ్యమంత్రి చెప్పారని, కానీ తమ పర్యటనలో 80 శాతం ధాన్యం కుప్పలు పేరుకుపోయి కనిపించాయని వెల్లడించారు. బీజేపీ పోరాటం చేయగానే.. ప్రభుత్వం సమీక్షలు, జిల్లాల్లో కల్లాల బాట పడుతోందన్నారు.
మంత్రులు ఇవే సమీక్షలు, పర్యటనలు ముందే చేస్తే బాగుండేదని వ్యాఖ్యానించారు. ఇసుక, సిమెంట్ లారీలను ముందే ఆపి ధాన్యం సేకరణ ఎందుకు చేయలేదని ఏలేటి ప్రశ్నించారు. రైతులే గన్నీ బ్యాగులు కొనే పరిస్థితి ఏర్పడిందన్నారు. లారీ, హామాలీల ఖర్చు రైతుల నుంచే వసూలు చేస్తున్నారని, రైతుల శ్రమను దోపిడీ చేస్తున్నారని ఏలేటి ధ్వజమెత్తారు. చివరి గింజ వరకు కొనే బాధ్యత తనదేనని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ధాన్యం కొనుగోలు చేతకాకపోతే దిగిపోమ్మని గత సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఎందుకు కొనుగోలు చేయడం లేదని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. గద్దెనెక్కగానే రేవంత్ రెడ్డి గద్దలెక్క మారిపోయారని చురకలంటించారు. ఓటు బ్యాంకు కోసమే రైతులను వాడుకుంటున్నారన్నారు. కేంద్రం ఇచ్చిన యూరియాను కూడా సక్రమంగా ఇవ్వకుండా.. యాప్ పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు.
Also Read: 15 ఏళ్ల వైభవ్ ను బెదిరించిన రియాన్ పరాగ్..ఎందుకురా నీకు ఇంత బిల్డప్ అంటూ!
ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వయసు మీరిందని, బుద్ధి మందగించింది కాబట్టే బీజేపీని విమర్శిస్తున్నారని విరుచుకుపడ్డారు. మంత్రి పదవుల కోసం, సూట్ కేసులు మోయడానికి కాంగ్రెస్ నేతలు ఢిల్లీ యాత్రలు చేస్తున్నారని ఏలేటి ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని, మంత్రులు ఉత్తమ్, తుమ్మల చర్చకు వస్తారా? అని సవాల్ విసిరారు. బీజేపీ యాత్ర చేస్తే కాంగ్రెస్ ఎందుకు భయపడుతోందని ఏలేటి ప్రశ్నించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కు పెట్రోల్, డీజల్ రేట్లపై ఏమాత్రం అవగాహన లేదని మండిపడ్డారు. పెట్రోల్, డీజల్ పై 30 శాతం వ్యాట్ ను ఎందుకు ముఖ్యమంత్రి తగ్గించడం లేదని నిలదీశారు. రైతు వడదెబ్బతో చనిపోతే మంత్రులు వెళ్లి పరామర్శించారా? అని, ఎక్స్ గ్రేషియా ప్రకటించారా? అని ఏలేటి ప్రశ్నించారు. సన్ ఫ్లవర్, శెనగలు కొంటున్నామని తుమ్మల చెబుతున్నారని, కౌంటర్ ఎక్కడ పెట్టారో చూపించాలని ఏలేటి విమర్శించారు. రాష్ట్రంలో దోపిడి రాజ్యం నడుస్తోందని ఏలేటి ధ్వజమెత్తారు.
Also Read: విద్యార్ధులకు అలర్ట్.. గురుకులాల టైం టేబుల్లో మార్పులు