Bandi Sanjay On Rajamouli: సినీ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఇటీవల వారణాసి ఈవెంట్ లో హనుమాన్ పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజమౌళికి కౌంటర్ ఇచ్చారు.
‘ఎవరి ఆలోచన వారిది. ఆ దేవుడు కరుణించి, దేవుడి ఆశీస్సులు రాజమౌళిపై ఉండి.. ఆయన దేవుడ్ని నమ్మే విధంగా, దేవుడి కరుణాకటాక్షాలు ఆయనపై ఉండాలని కోరుకుంటున్నాను. రాజమౌళి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను’ -బండి సంజయ్
బీజేపీ ఏ మతానికి వ్యతిరేకం కాదని బండి సంజయ్ అన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇండ్లు, రేషన్ బియ్యం అన్ని పథకాలు అన్ని మతాల వారికి ఇస్తున్నామన్నారు. బీజేపీకి అన్ని మతాలు ఒక్కటేనన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఇదే ధోరణి వ్యవహరించాలని కోరుతున్నామన్నారు. ఒక మతానికి కొమ్ముకాయకండని ఇతర పార్టీలను కోరుతున్నామని బండి సంజయ్ అన్నారు. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదన్నారు. బీజేపీ ముస్లింల మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రయత్నించలేదని, ఎక్కడా కూడా ఏ మసీదు కూలగొట్టలేదన్నారు.
“బీసీ, ఎస్సీ, ఎస్టీలకు బీజేపీ ఇప్పటికే పార్టీ పదవులు తగిన విధంగా ఇస్తుంది. బీసీలకు పార్టీలో 42 శాతం రిజర్వేషన్లు అని కాంగ్రెస్ ఇవాళ కొత్తగా మాట్లాడుతోంది. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ ఎందుకు ఇవ్వలేకపోతుంది. కాంగ్రెస్ బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ ఉంది కదా వాళ్లలో సర్వే చేయించి, ఎక్కడ గెలుస్తారో అక్కడ ఆయా వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలి. బండి సంజయ్ కు ఎవరితోనూ విభేదాలు లేవు. పార్టీ అధినాయకత్వం ఏం చెబితే అది చేస్తా, కష్టపడి కమిట్మెంట్ తో పనిచేస్తాను. పార్టీ కార్యకర్తల కోసం పనిచేస్తాను. నా మీద ఎవరికైనా అభిప్రాయ భేదాలు ఉంటే అవి మనసులోంచి తీసేయండి” అని బండి సంజయ్ అన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాసిక్యూషన్కు తెలంగాణ గవర్నర్ అనుమతించిన నేపథ్యంలో కాంగ్రెస్ ఏం చెబుతుందని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఫార్ములా ఈ కారు రేస్ కేసులో ఏసీబీ దర్యాప్తునకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని విమర్శించిన సీఎం రేవంత్రెడ్డి ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇన్నాళ్లూ గవర్నర్ అనుమతి అంటూ నాటకాలు ఆడారన్నారు. అవినీతిపరుల ఆస్తులు జప్తు చేస్తానని గతంలో రేవంత్ రెడ్డి అన్నారని, ఇప్పుడు సీఎం ఏం చేస్తారో చూడాలన్నారు. అర్బన్ నక్సలైట్లు చిన్నపిల్లలను రెచ్చగొడుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. కార్లలో తిరుగుతూ సొంత పైరవీలు చేసుకుంటూ రూ.కోట్లు సంపాదిస్తున్నారని మండిపడ్డారు.
Also Read: Telangana Politics: అనర్హత వేటు వ్యవహారం.. అనుచరులతో మంతనాలు, ఎమ్మెల్యే పదవికి దానం రాజీనామా?