Telangana Politics: తెలంగాణలో మళ్లీ ఉప ఎన్నికలు రానున్నాయా? రేపో మాపో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయనున్నారా? అనర్హత వేటు కారణంగా రాజీనామాకు సిద్ధమయ్యారా? ఇప్పటికే తమ తమ అనుచరులతో సుదీర్ఘంగా మంతనాలు సాగిస్తున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
తెలంగాణలో మళ్లీ ఉప ఎన్నిక ఖాయం?
పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ , తన పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలుమార్లు తమ అనుచరులతో సమావేశమయ్యారు. జరిగిన.. జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. వారి నుంచి వచ్చిన సూచనలతో రేపోమాపో ఆయన రాజీనామా చేయడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది.
బీఆర్ఎస్ నుంచి 10మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. వారిలో 8 మంది స్పీకర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. అందులో ఒకరు దానం నాగేందర్, మరొకరు కడియం శ్రీహరి ఉన్నారు. విచారణకు రావాలని స్పీకర్ నోటీసులు ఇచ్చినా ఇప్పటివరకు స్పందించలేదు. తాజాగా గురువారం మరోసారి ఇద్దరు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు స్పీకర్. అనర్హత పిటిషన్లపై అఫిడవిట్లు దాఖలు చేయాలని అందులో ప్రస్తావించారు.
రాజీనామా చేసే యోచనలో ఇద్దరు ఎమ్మెల్యేలు
పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు విధించిన గడువు సమీపిస్తున్న తరుణంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై తమ అనుచరులతోపాటు కాంగ్రెస్ సీనియర్లతో మంతనాలు సాగిస్తున్నారు ఆ ఇద్దరు నేతలు. అనర్హత వేటు తప్పదనే ఆందోళనలో నాగేందర్, కడియం ఉన్నట్లు తెలుస్తోంది. అనర్హత వేటు పడితే ఆరేళ్ల వరకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉండదని చెబుతున్నారు.
అప్పటివరకు వెయిట్ చేస్తే నష్టమని, ముందుగా రాజీనామా చేస్తే మంచిదనే యోచనలో దానం ఉన్నట్లు తెలుస్తోంది. వారికి సంబంధించిన బలమైన ఆధారాలు ఉండడంతో స్పీకర్ ముందు విచారణకు హాజరు కాలేదనే వార్తలు లేకపోలేదు. ఫిరాయింపులపై ఈ వారంలో స్పీకర్ తన నిర్ణయం వెల్లడించనున్నారు.
ALSO READ: తాను నెంబర్ వన్.. కేటీఆర్ నెంబర్ టూ అంటూ కవిత కామెంట్స్
ఆలోపు రాజీనామా చేయాలని ఆ నేతలిద్దరు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన దానం నాగేందర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో దానం నాగేందర్ కాంగ్రెస్ గూటికి చేరారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి బరిలోకి దిగారు. మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కావ్య వరంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమె తరఫున కడియం ప్రచారం, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ నేతలిద్దరికి సంబంధించి ఆధారాలు ఉండడంతో రాజీనామాకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.