BJP MLA Payal Shankar: ఆ రెండు జాతీయ పార్టీలు.. వాటి సిద్దాంతం పరస్పర విరుద్దం. పైగా తెలంగాణలో కాంగ్రెస్కు తామే ప్రత్యమ్నాయం అంటోంది బీజేపీ. అధికారంలోకి రాబోయేది కూడా తామేనని చెప్తోంది. కానీ ఆ బీజేపీ ఎమ్మల్యే మాత్రం.. కాంగ్రెస్ పార్టీ సీఎంను ఆకాశానికిఎత్తారు. ఏకంగా ప్రశంసలు, పొగడ్తలతో.. సొంతం పార్టీ ఎమ్మెల్యే కంటే ముఖ్యమంత్రికి ఎక్కువ ఎలివేషన్ ఇచ్చారు. ఇంతకు ఆ కమలం పార్టీ ఎమ్మెల్యే ఎందుకలా మాట్లాడారు? బీజేపీ పెద్దల రియాక్షన్ ఏంటి?
కాంగ్రెస్ సీఎం, బీజేపీ ఎమ్మెల్యే.. ఆ రెండు పార్టీలు లైన్ వేరు. వాటి భావజాలం అంతకంటే వేరు. కానీ అధికార పార్టీ సీఎంపై.. బీజేపీ ఎమ్మెల్యే ప్రశంసలు కురిపించిన సీన్..ఆదిలాబాద్లో జరిగిన ప్రజాపాలన విజయోత్సవాల్లో హైలెట్గా నిలిచింది. సాధారణంగా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి హైప్ ఇచ్చే వేదిక. కానీ ఈసారి హైలెట్ సీఎం రేవంత్ కాదు.. ఆయనను పొగడ్తలతో ముంచెత్తిన బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. సీఎం హెలికాప్టర్ నుండి దిగినప్పటి నుంచి.. సభ పూర్తయ్యే దాకా అన్నీ తానై చూసుకున్న పాయల్ శంకర్ ప్రోటోకాల్ కంటే ఎక్కువగా వ్యవహరించడం అందరిలోనూ సందేహాలు రేకెత్తించింది.
కాంగ్రెస్ నేతలు కూడా ఇంతలా స్వాగతం పలకనంత ఇంటెన్సిటీతో, సొంత బహుమతి ఇచ్చి.. సీఎం కారు పక్కనే నడుచుకుంటూ సభ వరకు వెంట వెళ్ళడం ఆదిలాబాద్ ప్రజల్లోనూ, బీజేపీ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది.
అయితే ప్రోటోకాల్లో భాగంగా సీఎం ప్రోగ్రామ్లో బీజేపీ ఎమ్మెల్యే పాల్గొన్నారుకున్నారు అంతా. కానీ ఎప్పుడైతే సభాధ్యక్ష ఉపన్యాసం స్టార్ట్ చేశారో.. అప్పుడు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు పాయల్ శంకర్. సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ లీడర్లు, మంత్రులకంటే కూడా గొప్పగా పొగడ్తలతో ముంచెత్తారు.
ఇంతలో కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ఎమ్మెల్యే హాజరైనందుకు నినాదాలు మొదలుపెట్టారు. పరిస్థితి ప్రతికూలంగా మారుతుండటంతో..
సీఎం స్వయంగా సిగ్నల్ ఇచ్చి మంత్రి జూపల్లి కృష్ణారావును హస్తం క్యాడర్ను శాంతింపజేయమన్నారు. అలా వేదిక మళ్లీ కూల్ అయింది. కానీ అప్పటికే పాయల్ శంకర్ ప్రసంగం అందరి దృష్టి ఆకర్షించింది. ప్రసంగం ముగిసే సరికి, సభలో ఉన్న ప్రజలు కూడా ఒక్కసారి అయోమయంలో పడ్డారు. బీజేపీ ఎమ్మెల్యేనా? లేక కాంగ్రెస్ నాయకుడా? అన్న సందేహం పక్కనే ఉన్న వారిలో వ్యక్తమైంది.
బీజేపీ క్యాడర్ పూర్తిగా షాక్. రేవంత్ను ఆకాశానికి ఎత్తేసిన తీరు చూసి అంతా విస్తుపోయారట.
Also Read: సర్పంచ్ ఎన్నికల్లో ట్రాన్స్జెండర్ల క్రేజ్.. ప్రచార వేడి పెంచుతున్న కొత్త సెంటిమెంట్
సీఎం రేవంత్ కూడా పాయల్ శంకర్, బీజేపీపై సాఫ్ట్ కార్నర్ స్పీచ్ ఇచ్చారంటూ కాంగ్రెస్ నేతలు గుసగుసలు పెట్టుకుంటున్నారు. సీఎం స్పీచ్తో పాటు పాయల్ శంకర్ స్పీచ్ కేవలం బీఆర్ఎస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేశాయి. ఆదిలాబాద్లో సీఎం సభ జరిగిన రోజు బీజేపీ రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. హిందూ దేవుళ్లపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ దిష్టిబొమ్మల దగ్ధం చేసింది. ఒక్క ఆదిలాబాద్ నియోజకవర్గంలో మాత్రం నిరసనలు కనబడకపోగా ఎమ్మెల్యే సీఎంను మోసేయడంపై సొంత పార్టీలోనూ కొందరు అసంతృప్తికి చెందుతున్నారంట.