Mahadevappa Suicide స్వేఛ్చ బ్యూరో: మక్తల్ బీజేపీ 6వ వార్డు అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య సెగ డీజీపీ కార్యాలయానికి తాకింది. ఆయన ఆత్మహత్యకు కాంగ్రెస్ నేతల వేధింపులే కారణమని బీజేపీ ఆరోపించింది. ఈనేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం ఆందోళనకు పిలుపునిచ్చింది. డీజీపీ కార్యాలయం ముట్టిడికి ఆదేశించింది. దీంతో శ్రేణులంతా డీజీపీ కార్యాలయానికి తరలిరావడంతో స్థానిక పరిసరాలు అట్టుడికిపోయాయి. ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రికత్త చోటుచేసుకుంది. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకునేందకు ప్రయత్నించారు. దీంతో కార్యకర్తలు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ తోపులాట వల్ల పలువురు పోలీసులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా డీజీపీ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు రోడ్డుపై బైఠాయించారు. కాగా పోలీసులు, నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
మహదేవప్ప ఆత్మహత్యపై బీజేపీ శ్రేణుల తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. మహదేవప్పది ఆత్మహత్య కాదని, కాంగ్రెస్ చేసిన హత్య అని కేంద్ర మంత్రి బండి సంజయ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు.. ఓటమి భయంతోనే బెదిరింపులు, అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ను రాళ్లతో కొట్టే పరిస్థితి రాబోతోందని పేర్కొన్నారు. తమ సహనాన్ని పిరికితనంగా భావించొద్దని బండి సూచించారు. ఎన్నికల తరువాత కాంగ్రెస్ పై యుద్ధం చేయబోతున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ అరాచకాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర బీజేపీ కార్యకర్తలదని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్తాపితం చేసే రోజులొచ్చాయని, బీజేపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని సూచించారు. మహదేవప్ప ఆత్మహత్యకు కారకులైన కాంగ్రెస్ నేతలను వెంటనే అరెస్ట్ చేయాలని బండి డిమాండ్ చేశారు.
Also Read: Today Horoscope in Telugu: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో అంతరాయం
ఇదిలాఉండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ.. మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా కలిచివేసినట్లు ఆవేదన వ్యక్తంచేశారు. ఇది అత్యంత బాధాకరమైన ఘటన అని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మహదేవప్ప మరణం వెనుక కాంగ్రెస్ అహంకార రాజకీయాలు, మాఫియా బెదిరింపులే కారణమని తెలుస్తోందన్నారు. స్థానిక మంత్రి శ్రీహరి, ఆయన అనుచరుల వేధింపులు తట్టుకోలేకే మహాదేవప్ప ఆత్మహత్యకు పాల్పడ్డారని బలమైన ఆరోపణలు ఉన్నాయన్నారు. ఈ ఘటనకు కారణమైన మంత్రి శ్రీహరిని తక్షణమే అరెస్ట్ చేసి, కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు.
రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ సైతం తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్ నగర్ లో మంత్రి, అధికార పార్టీ ఒత్తిడి వల్లే మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. గెలవడం ఖాయమని, గెలిచిన తర్వాత కూడా తనను అధికార పార్టీ వేధిస్తుందని తన భార్యతో మహదేవప్ప చెప్పారన్నారు. బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్య లు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మహాదేవప్ప ఆత్మహత్యకు కాంగ్రెస్ పెద్దల దౌర్జన్యం, వేధింపులే కారణమని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సమగ్ర విచారణ జరిపించి, దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా బీజేపి అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య బాధాకరమని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ఆవేదన వ్యక్తంచేశారు. ఇది కాంగ్రెస్ అరాచక పాలనకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ అధికార పార్టీ చేసిన హత్యే అని ఆరోపించారు.
Also Read: Gundeninda Gudigantalu Meena: ‘ గుండెనిండా గుడిగంటలు ‘ మీనా ఆస్తుల విలువ ఎంతంటే..?