Ramchander Rao: స్వేచ్ఛ బ్యూరో: కోహెడ ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపన కోసం స్థానిక రైతులను పోలీసులు అరెస్ట్ చేశారని, సీఎం రేవంత్ రెడ్డి వెళ్లే వరకు బలవంతంగా నిర్బంధించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు వ్యతిరేకించినా రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారన్నారు. రైతులకు పరిహారం ఇచ్చి శంకుస్థాపన చేయాలి కదా? అని ఆయన ప్రశ్నించారు.
బీజేపీ తలుచుకుంటే మంత్రులు బయటకు రాలేరు..
రైతులను తుపాకీలు పెట్టి భయపెట్టాలని అనుకుంటే ఎలా? అని ప్రశ్నించారు. రైతులకు అన్యాయం చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని వెల్లడించారు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు గ్రామాలు దాటి బయటకు రాలేరని హెచ్చరించారు. పేద ప్రజలపై మంత్రులు అన్యాయంగా కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారున. బీజేపీ నేతలు వెళ్తే అడ్డుకుంటున్నారని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో తమను అడ్డుకోవడానికి కాంగ్రెస్ నేతలెవరని రాంచందర్ రావు ప్రశ్నించారు. తెలంగాణాలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేననేది గుర్తుపెట్టుకోవాలని స్పష్టంచేశారు.
చర్చకు రావాలని సవాల్
కేంద్రం.. తెలంగాణ అభివృద్ధికి రూ.13 లక్షల కోట్లు కేటాయించిందని, కాదంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఏ జిల్లాకు ఎంత ఇచ్చామో పూర్తి లెక్కలు చెబుతామన్నారు. ఎంఐఎం కోసం జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేశారని విమర్శించారు. ప్రభుత్వం నడపలేక భూములు అమ్ముతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు.. మజ్లీస్ సోపతి పట్టి నిజాం భాష మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. ఇది నిజాం రాజ్యం కాదని, తమ నాయకులపై మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని రేవంత్ రెడ్డికి సూచించారు.
నీటి పారుదల రంగంపై కీలక సమావేశం
ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గోదావరి, కృష్ణా నదీ జలాలు, ప్రాజెక్టులు, నీటి పారుదల రంగంపై కీలక సమావేశం జరిగింది. ఈ ప్రత్యేక అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాంచందర్ రావు, ప్రముఖ రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. ఈ మీటింగ్ లో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, మీడియా ప్యానలిస్టులకు అవగాహన కల్పించారు. గోదావరి, కృష్ణా నదీ జలాలు, ప్రాజెక్టులు, నీటి పారుదల రంగంపై టీవీ డిబేట్స్, ఇతర వేదికలపై మాట్లాడేందుకు ఈ అవగాహన పనికొస్తుందని రాంచందర్ రావు దిశానిర్దేశం చేశారు.
రాంచందర్ రావు కీలక సమావేశం
ఇదిలాఉండగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అధ్యక్షతన నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్న పార్టీ రాష్ట్ర స్థాయి పదాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ అభయ్ పాటిల్, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీతో పాటు పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు, పదాధికారులు పాల్గొన్నారు.
ప్రజలతో కార్యకర్తుల మమేకం
ఈ సమావేశంలో రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, సంస్థాగత కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన ఉద్యమాలు, రానున్న రోజుల్లో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో మరింత మమేకమై వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా కార్యాచరణ రూపొందించాలని నాయకత్వం దిశానిర్దేశం చేసింది.
ప్రజల్లోకి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు
అదేవిధంగా, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు పలు కార్యక్రమాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. ముఖ్యంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపులో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నెలకొన్న సమస్యలు, ఇతర ప్రజా సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించి కార్యాచరణ రూపకల్పన చేశారు.
Also Read: వచ్చేది మా ప్రభుత్వమే.. రాసి పెట్టుకోండి.. రేవంత్కు హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్!