RTO Brokers: స్వేచ్చ బ్యరో: రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆర్టీఏ, ఆర్టీవో కార్యాలయాల్లో బ్రోకర్లు, ఏజెంట్ల జోక్యం, అక్రమ స్లాట్ బుకింగ్ దందా, ఆన్లైన్ సేవల్లో సాంకేతిక లోపాలపై ఈ నెల 21న స్వేచ్ఛ దినపత్రికలో ‘సార్.. ఏం కావాలి’ అనే కథనాన్ని ప్రచురించింది. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) కోసం చెల్లింపులు పూర్తి చేసినప్పటికీ ప్రజలు జాప్యాన్ని ఎదుర్కొంటున్నారని, ఉచితంగా అందుబాటులో ఉండాల్సిన ఆన్లైన్ స్లాట్ బుకింగ్కు బ్రోకర్లు అదనపు వసూలు చేస్తున్నారని, ఖైరతాబాద్, మలక్పేట, బండ్లగూడ, కొండాపూర్, తిరుమలగిరి వంటి కార్యాలయాల ఆవరణలో ఏజెంట్లు బహిరంగంగా కార్యకలాపాలు సాగిస్తున్నారని కథనాన్ని ప్రచురించింది.
ఈ కథనాన్ని తెలంగాణ రవాణా శాఖ తీవ్రంగా పరిగణించి, క్షేత్రస్థాయి అధికారులందరికీ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. గోప్యంగా విచారణ చేపట్టి, ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని హైదరాబాద్ జోన్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తో పాటు రాష్ట్రంలోని అన్ని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు (డీటీసీలు), జిల్లా రవాణా అధికారులను (డీటీవోలు) ఆదేశించింది. కార్యాలయాల చుట్టుపక్కల బహిరంగంగా పనిచేస్తున్న దళారులు, బ్రోకర్లను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని, ‘బ్రోకర్లకు నో ఎంట్రీ’ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (విజిలెన్స్ , ఎన్ఫోర్స్మెంట్) చంద్రశేఖర్ గౌడ్ ఆదేశించారు. సాంకేతిక కారణాలతో పెండింగ్లో ఉన్న ఆర్సీ, డీఎల్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. ఆన్లైన్ స్లాట్ బుకింగ్ వ్యవస్థలో లోపాలను ఎన్ఐసీ, రాష్ట్ర డేటా సెంటర్తో సమన్వయం చేసుకుని సరిదిద్దాలన్నారు.
సిబ్బందికి ఆన్లైన్ సేవలపై అవగాహన కల్పించి, సాంకేతిక కారణాలతో ప్రజలను వెనక్కి పంపకుండా చూడాలన్నారు. బ్రోకర్లతో కుమ్మక్కైనట్లు తేలిన అధికారులు, సిబ్బందిపై బాధ్యతను నిర్ధారించి కఠిన క్రమశిక్షణా చర్యలు చేపట్టాలన్నారు. అన్ని క్షేత్రస్థాయి కార్యాలయాలు ఏడు రోజుల్లోగా నివేదిక అందజేయాలని ఆదేశించారు. పారదర్శకమైన, ఇబ్బంది లేని, అవినీతి రహిత సేవలు అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. బ్రోకర్ల జోక్యం లేదా అక్రమ వసూళ్ల గురించి ఎవరైనా గమనిస్తే నేరుగా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పౌర సేవల విశ్వసనీయతను దెబ్బతీసేలా వ్యవహరించే లేదా బ్రోకర్లు, ఏజెంట్లతో కుమ్మక్కయ్యే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు, క్రమశిక్షణా చర్యలు తప్పవని రవాణా శాఖ హెచ్చరించింది.
Also read: Rahul Gandhi: మోదీ సర్కార్కు రాహుల్ గాంధీ వార్నింగ్.. పేపర్ లీకుల లెక్కలు బయటపెట్టిన రాహుల్!