Kiran Kumar Reddy: స్వేచ్ఛ బ్యూరో: లోక్సభను కేంద్ర ప్రభుత్వం అత్యంత దారుణమైన రీతిలో నడుపుతోందని భువనగిరి లోక్ సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద కాంగ్రెస్ ఎంపీలందరూ నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అంశంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. నీట్ పరీక్షలలో జరిగిన భారీ అవకతవకలు, కుంభకోణంపై పార్లమెంట్లో పూర్తిస్థాయి చర్చ చేపట్టాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులపై జరిగిన క్రూరమైన లాఠీ ఛార్జ్పై సమగ్ర విచారణ జరిపించాలన్నారు.
ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలు, లాఠీ ఛార్జ్ అంశాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధికారిక స్టేట్మెంట్ విడుదల చేయాలన్నారు. ఇక పార్లమెంట్ లో రాహుల్ గాంధీ మైక్ కట్ చేసినప్పుడు, నిరసనగా తాము స్పీకర్ వెల్లోకి వెళ్తే తమను అన్యాయంగా సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. లోక్ సభలో 2/3 వంతు మెజారిటీ సాధించి, దేశంలో ప్రాంతీయ పార్టీల మనుగడ లేకుండా చేయాలని బీజేపీ పెద్ద ఎత్తున కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ ఏకపక్ష వైఖరిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని, పార్లమెంట్ను ప్రజాస్వామ్యబద్ధంగా నడపాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, దేశ ప్రజాస్వామ్య రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు.
Also Read: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి కీలక సూచన.. వాట్సాప్, మీ సేవలో మళ్లీ దరఖాస్తులు!