KTR: స్వేచ్ఛ బ్యూరో: ఆదిలాబాద్ లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కర్మాగారం పునరుద్ధరణపై కాంగ్రెస్ ప్రభుత్వ విధానం స్పష్టం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి బుధవారం లేఖ రాశారు. సీసీఐ పునరుద్ధరణ అనేది కేవలం ఒక పరిశ్రమకు సంబంధించిన అంశం మాత్రమే కాదు. ఇది వేలాది కుటుంబాల జీవనాధారం, ఆదిలాబాద్ జిల్లా పారిశ్రామిక భవిష్యత్తు, తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన అత్యంత కీలకమైన అంశం అన్నారు.
సీసీఐ పరిశ్రమను తిరిగి ప్రారంభించండి..
ఈ పరిశ్రమను పునఃప్రారంభించాలనే ఏకైక లక్ష్యంతో, ఈ నెల 15న సీసీఐ సాధన సమితి ప్రతినిధులతో కలిసి బీఆర్ఎస్ నేతల బృందం ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి కుమారస్వామి ని ప్రత్యేకంగా కలిశామన్నారు. సీసీఐ పరిశ్రమను తిరిగి ప్రారంభించాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఆదిలాబాద్ సీసీఐ పునరుద్ధరణ వల్ల పెద్దఎత్తున లభించే ఉపాధి అవకాశాలు, స్థానికంగా కలిగే ప్రయోజనాలు, చుట్టపక్కల ప్రాంతాల్లో జరిగే ప్రగతి పై కేంద్రానికి సవివరంగా తెలియజేశామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో చిత్తశుద్ది లేదు..
రూ.250కోట్ల పెట్టుబడిని పెట్టేందుకు తెలంగాణ ముందుకు వస్తే సీసీఐ ఆదిలాబాద్ ప్లాంట్ పునరుద్ధరణ సాధ్యమవుతుందని, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ దిశగా ఎలాంటి ప్రతిపాదనలుకానీ, రాయితీలు కానీ, సహకారంపై అధికారిక సమాచారం కానీ అందకపోవడం వల్లే ప్రక్రియ ఆలస్యమవుతోందని కేంద్ర మంత్రి వెల్లడించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపితే సీసీఐ పునరుద్ధరణకున్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయన్నారు. సీసీఐ పునరుద్ధరణపై కేంద్రం సానుకూలంగా ఉన్నదనే విషయం స్పష్టమైపోయిందన్నారు. ఓవైపు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర సర్కారు స్పందన కోసం ఎదురుచూస్తున్న ఈ పరిస్థితుల్లో ఇప్పటివరకు అధికారిక వైఖరిని ప్రకటించకపోవడం అత్యంత విచారకరం అన్నారు. గత రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఈ విషయంలో జాప్యం జరుగుతోందనే విషయం తేటతెల్లమైందన్నారు.
నిర్లక్ష్యం చూపుతున్న ప్రభుత్వం..
ఒకవేళ కేంద్రంతో కలిసి ముందుకు సాగడం సాధ్యం కాదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తే, స్వయంగా ఈ పరిశ్రమను పునరుద్ధరించే అంశంపై కూడా ఎలాంటి ప్రత్యామ్నాయాన్ని ప్రకటించకపోవడం మరింత నిరాశ కలిగిస్తోందన్నారు. ఆదిలాబాద్ వంటి వెనుకబడిన జిల్లాలో వేలాది మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ విషయంలో ప్రభుత్వం చూపుతున్న ఈ నిర్లక్ష్యం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆదిలాబాద్ పర్యటన సందర్భంగా ఈ పరిశ్రమను తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని, సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా వెనుకబడిన జిల్లా అయిన ఆదిలాబాద్ లో తప్పకుండా సీసీఐని తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించారు.
Also Read: ఖాకీవనంలో కామతురాణం.. ఉదయ్ కృష్ణారెడ్డి భవితవ్యం ఎటువైపు?
పక్కన పెట్టిన హామీలు..
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలతోపాటు ముఖ్యమంత్రిగా ఇచ్చిన మాటను కూడా అధికారంలోకి రాగానే పూర్తిగా పక్కన పెట్టేశారు. పరిశ్రమ పునరుద్ధరణపై ఇప్పటిదాకా కనీసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడకపోవడం సర్కారు వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనం అన్నారు. కేంద్రంతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రభుత్వమే స్వయంగా ఈ ప్లాంట్ను పునరుద్ధరించాలనే ప్రత్యామ్నాయ ప్రణాళిక కూడా లేకపోవడం ఆదిలాబాద్ ప్రజలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని కళ్లకు కడుతోందన్నారు.
పెట్టుబడి పెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమా..?
ఆదిలాబాద్ సీసీఐ పునరుద్ధరణపై తెలంగాణ ప్రభుత్వ అధికారిక వైఖరి ఏమిటి?, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఈ అంశంపై ఎలాంటి ప్రతిపాదనలు పంపింది? రూ.250 కోట్లను రాష్ట్ర వాటాగా పెట్టుబడి పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందా, లేదా? సీసీఐ పునరుద్ధరణ కోసం టీఎస్-ఐపాస్ తరహా రాయితీలను వర్తింపజేయడానికి మీ ప్రభుత్వం సిద్ధమేనా?అవసరమైతే కేంద్ర-రాష్ట్ర సంయుక్త భాగస్వామ్యంతో పరిశ్రమ నిర్వహించేందుకు రాష్ట్ర సర్కారు ముందుకు వస్తుందా? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే, తెలంగాణ ప్రభుత్వం స్వయంగా ఈ పరిశ్రమను పునరుద్ధరించే కార్యాచరణ ప్రణాళిక ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు.
ఆదిలాబాద్ ప్రజల దృష్ట్యా..
ఆదిలాబాద్ ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని, రాజకీయాలకు అతీతంగా ఈ అంశంపై వెంటనే సానుకూల నిర్ణయం తీసుకొని, కేంద్ర ప్రభుత్వానికి అవసరమైన ప్రతిపాదనలు పంపాలని, సీసీఐ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం తన పూర్తి సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ అభివృద్ధి కోసం, వేలాది కుటుంబాల భవిష్యత్తు కోసం, ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఇకనైనా చిత్తశుద్ధితో వ్యవహరించాలని కోరారు.
Also Read: నీట్ స్కామ్పై కేంద్రానికి కాంగ్రెస్ డెడ్లైన్.. భువనగిరి ఎంపీ చామల సంచలన వ్యాఖ్యలు!